రేపటితో ముగియనున్న గడువు
సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్టుడే: చురుకైన తెలివితేటలు.. చదువుపై మంచి పట్టున్నప్పటికీ కుటుంబ ఆర్థిక కారణాలతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపకార వేతనాలను అందజేస్తోంది. జాతీయ ఉపకార వేతన పథకం(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్) కింద 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షలో నెగ్గితే చాలు ప్రభుత్వ ప్రోత్సాహకం అందుకోవచ్చు. ఈ పరీక్ష రాయడానికి దరఖాస్తుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపితే పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
పరీక్ష నిర్వహణ ఇలా..
రాష్ట్రస్థాయిలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్, ఇతర విభాగాల వారీగా అర్హుల జాబితా రూపొందిస్తారు. మొత్తం 180 మార్కులకు నిర్వహించే పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. పరీక్ష రాయడానికి మూడు గంటల పాటు సమయాన్ని కేటాయించారు.
మెంటల్ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 90 మార్కులు
స్కాలిసిక్ ఆప్టిట్యూడ్ పరీక్ష: ఇందులో 7, 8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య, సాంఘిక విషయాలపై 90 ప్రశ్నలు ఇస్తారు. 90 మార్కులు.
అర్హతలు..
ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ అర్హులు. వీరు ఏడో తరగతిలో ఓసీ/బీసీలైతే 55 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ పొంది ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది.
ప్రశ్నపత్రాలు సాధన చేయాలి: బి.నాగరాజు, గణితశాస్త్ర విషయ నిపుణుడు, సూర్యాపేట
జాతీయ ఉపకార వేతనాల పోటీ పరీక్ష పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరం. 7, 8 తరగతుల విషయాలతో పాటు రీజనింగ్ కోసం మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
ఏడాదికి రూ.12 వేలు
ఈ పరీక్షలో ఎంపికైతే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకార వేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు అందుతాయి. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమ చేస్తారు.
దరఖాస్తు విధానం..
రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ‘బీఎస్ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా విద్యార్థి దరఖాస్తును నింపి, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, చిత్రాలు అప్లోడ్ చేయాలి. ఓసీ/బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 పరీక్ష రుసుం ఆన్లైన్లోనే చెల్లించాలి. దరఖాస్తులకు తుది గడువు అక్టోబరు 28 వరకు ఉంది. నకలు పత్రాలను ప్రధానోపాధ్యాయులు అక్టోబరు 29లోగా జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయాలి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి
‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.