* ఆచరణకు నోచని మంత్రి బొత్స ప్రకటన
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పదోన్నతులు కల్పించి, ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది బదిలీలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులూ చెప్పలేని దుస్థితి. బదిలీలకు సంబంధించిన నిబంధనలు తరచూ మార్పులు చేస్తుండడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు పని చేస్తే తప్పనిసరి బదిలీ ఉండేలా నిబంధన ఉంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల సర్వీసుగా సవరించారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు నిబంధన ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో మార్పు చేశారు. ఆ మేరకు మార్పులు చేసిన అధికారులు తిరిగి దస్త్రాన్ని పంపించారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చల్లో సంఘాల నాయకులు కనీసం సర్వీసు జీరో ఉన్నా బదిలీ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలా తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్నారే తప్ప బదిలీలను మాత్రం నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
వేసవి సెలవుల్లో ఏం చేశారు?
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బోధనకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. మే, జూన్లో సమయం దొరికినా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. ఒక వేళ ఇప్పుడు విడుదలైనా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, వెబ్ ఐచ్ఛికాల నమోదు, కౌన్సెలింగ్ నిర్వహణకు 30-40రోజులు సమయం పడుతుంది. అంటే డిసెంబరు వచ్చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏం చేశారని.. 3,4 నెలలు గడిస్తే విద్యా సంవత్సరమే ముగిసిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.