పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్
గజ్వేల్, న్యూస్టుడే: దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం విద్య కోసం ఖర్చు పెడుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నవంబరు 20న నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘2014లో విద్యపై రూ.9,518 కోట్లు ఖర్చుపెట్టగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25,250 కోట్లకు పెంచాం. మన ఊరు, మన బడి ద్వారా అన్ని పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. మాది ఉపాధ్యాయ, ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం. తెలంగాణలో తలసరి ఆదాయం 2014లో రూ.1,24,000 ఉంటే ఇప్పుడు రూ.2,75,000కు పెరిగింది. ఇప్పటికీ దేశ తలసరి ఆదాయం రూ.1,50,000 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 295 ఉంటే ప్రస్తుతం 920కి చేరింది. వైద్య సీట్లు 850 నుంచి 2,950కి పెరిగాయి. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అయినా కొందరు మేధావులు తెలంగాణలో అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు చర్చ పెట్టాలి. రాష్ట్రంలోని మంచిచెడులను ప్రజలకు తెలియజేయాలి. వివిధ పద్దుల కింద రావాల్సిన రూ.21 వేల కోట్లను కేంద్రం ఆపేసింది. అయినా ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇస్తున్నాం. గుజరాత్లో లేని వేతనాలు ఇక్కడ ఉన్నాయి. త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీలు, పదోన్నతులు, బదిలీలు చేపడతాం. ఆరోగ్యకార్డులు, పీఎఫ్ సొమ్ము జమ విషయంలో తగు చర్యలు తీసుకుంటాం. పాత పింఛను విధానంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని హరీశ్రావు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.