• facebook
  • whatsapp
  • telegram

AE Exam: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రద్దు

* ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పోస్టుల భర్తీకి మార్చి 5న నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. పరీక్ష ప్రశ్నపత్రం లీకవడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మార్చి 15న‌ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ సభ్యులు, కార్యదర్శి సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల్లో 833 సహాయ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 5న రాతపరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా... 55 వేల మంది రాశారు. అయితే ఈ నెల 11న ఏఈ, టీపీబీవో ప్రశ్నపత్రాలను టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న ఏఎస్‌వో ప్రవీణ్‌, సిస్టమ్‌ అనలిస్టు రాజశేఖర్‌లు కంప్యూటర్‌ నుంచి దొంగలించినట్లు సమాచారం అందింది. దీనిపై కమిషన్‌ ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో పోలీసు కేసు నమోదైంది. గురుకుల ఉపాధ్యాయిని రేణుక సహాయంతో అభ్యర్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా? కొనసాగించాలా? అనే విషయమై రెండు రోజులుగా చర్చలు జరిగాయి. మంగళవారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పోలీసు, న్యాయ నివేదికలు అందడంలో ఆలస్యం కావడంతో కమిషన్‌ సమావేశం కాలేదు. బుధవారం సాయంత్రం న్యాయ నివేదిక వచ్చాక పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామంది.

 

ఇలా జరిగితే.. రద్దు చేయాల్సిందే

సాధారణంగా ఏదైనా పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కవర్‌ సీలును పరీక్ష తేదీకి, సమయానికి ముందుగా తెరిచినా, బయటి వ్యక్తులు, అభ్యర్థుల చేతికి ప్రశ్నపత్రం వచ్చినా లీకైనట్లు భావిస్తారు. అందువల్ల ఏఈ పరీక్షను రద్దు చేస్తారని అందరూ భావించారు. అయితే అభ్యర్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటామని కమిషన్‌ తెలిపింది. పోలీసు కేసు నమోదైనందున ఆధారాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కమిషన్‌కు న్యాయసలహా వచ్చింది. అభ్యర్థుల్లో అపోహలను తొలగించేందుకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్‌వర్గాలు వెల్లడించాయి. సిట్‌ నివేదిక వచ్చాక అందులో అంశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశాయి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.