బీటెక్కు వెళ్లకుండా నిలువరించేందుకే
ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వారు ఉన్నత చదువులకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అందుకు ఒక ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి తక్కువ వేతనాలు లభిస్తుండడం, ఉన్నత చదువులు చదివితేనే అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా మంది బీటెక్కు వెళ్లిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకంటూ వింత నిబంధనను తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం మూడేళ్లు చదువు పూర్తి చేసుకున్న తర్వాత నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. ఇక పాలిటెక్నిక్ నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.
‣ పాలిటెక్నిక్ అర్హతతో ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో పాలిటెక్నిక్ తర్వాత బీటెక్కు నేరుగా వెళ్లకుండా మధ్యలో ఏడాది పరిశ్రమలో పని చేసేలా నిబంధన తెస్తే పరిశ్రమలోనే ఉండిపోతారనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. విద్యార్థి దశలో ప్రతి ఏడాది ఎంతో విలువైన సమయం. ఉన్నత చదువులకు వెళ్లిపోతున్నారనే కారణంతో ఏడాది సమయాన్ని ఎలా వృథా చేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకారం పాలిటెక్నిక్ తర్వాత బీటెక్లో ప్రవేశాలు పొందొచ్చు. దీని ప్రకారమే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తోంది. విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించి, మెరుగైన వేతనాలు లభిస్తే పాలిటెక్నిక్తోనే ఉద్యోగాల్లో చేరతారు. కానీ, ఇవేమి పట్టించుకోకుండా పరిశ్రమల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల అవసరం ఉందని, వారు బీటెక్కు వెళ్లిపోవడం వల్ల సూపర్వైజర్లు లభించడం లేదని అధికారులు వింత వాదనలు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.