గాంధీనగర్(విజయవాడ), న్యూస్టుడే: ప్లాస్టిక్ రంగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులకు సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్), సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్(సీఎస్టీఎస్) విజయవాడ 2023-24 సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సిహెచ్ శేఖర్ తెలిపారు. ఏప్రిల్ 20న ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోర్సుల వివరాలు వెల్లడించారు. మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ(డీపీటీ) కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500, రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ, పీపీటీ) కోర్సుకు బీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఇంటర్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నేరుగా రెండో సంవత్సరం డిప్లొమా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుందని, ఈ కోర్సులు చేసిన వారికి వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శేఖర్ వెల్లడించారు. 90 శాతం ప్లేస్మెంట్స్ సాధించడం గర్వంగా ఉందన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 28 అని, ఆలిండియా సీపెట్, కాట్ పరీక్ష జూన్ 11వ తేదీ నిర్వహిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు 9440531978, 9959333414 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.