* సీయూఈటీలో విలీనానికి వీలుకాకుంటే ప్రత్యేకంగా నిర్వహణ
* వచ్చే రెండేళ్లలో నిర్వహించే దిశగా కేంద్రం యోచన
ఈనాడు, హైదరాబాద్: ఒకే దేశం - ఒకే ప్రవేశపరీక్ష విధానాన్ని అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ తరహాలోనే ఇంజినీరింగ్కి కూడా జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి 2016 నుంచి నీట్ నిర్వహిస్తుండగా.. గత ఏడాది నుంచి దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2023-24 విద్యాసంవత్సరం నుంచి 57 కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టనున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్లను కూడా జాతీయ ప్రవేశపరీక్ష ద్వారానే నింపుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. కాగా అన్ని రాష్ట్రాల్లోని బీటెక్ సీట్ల భర్తీకి కూడా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరపాలని 2016 నుంచే కేంద్రం యోచిస్తోంది. ఎన్ఐటీల్లో సీట్ల భర్తీకి 2013 నుంచి జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ పరీక్షలో అన్ని రాష్ట్రాలు చేరితే ఇంజినీరింగ్ ప్రవేశాలకు వినియోగించుకోవచ్చన్నది ఆలోచన. ఈమేరకు అప్పట్లో కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించింది. అనంతరం ఆ అంశం మరుగున పడింది.
తాజాగా మరోసారి తెరపైకి..
ఐఐటీ కౌన్సిల్ సమావేశం ఏప్రిల్ 18న భువనేశ్వర్ ఐఐటీలో జరిగింది. దేశంలోని 23 ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ ఛైర్మన్లు, యూజీసీ, ఏఐసీటీఈ ఛైర్మన్లతో పాటు ఐఐటీ కౌన్సిల్ ఛైర్మన్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఎజెండాలో భాగంగా ఇంజినీరింగ్కు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ‘పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సానుకూలతలు, ప్రతికూలతలను లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి కోరారు’ అని ఐఐటీ గవర్నింగ్ బాడీ ఛైర్మన్ ఒకరు తెలిపారు. ఈమేరకు ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చ కొనసాగుతోందన్నారు. ఒక విధానం నుంచి మరో విధానానికి మారాలంటే కొంత సమయం పడుతుందని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రవేశపరీక్షకు రెండు లేదా మూడేళ్ల సమయం ఇస్తామని వివరించారు. ఈ విషయమై ఒక నిర్ణయానికి వస్తే.. 2025-26 నుంచి అమలుకు అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఐఐటీల్లో సీట్ల భర్తీకి ప్రస్తుతం జరుపుతున్న జేఈఈ అడ్వాన్స్డ్ను రద్దుచేసి దాన్ని కూడా ఉమ్మడి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలోకి తీసుకురావాలన్న అంశం కూడా చర్చకు రాగా ఎక్కువ మంది డైరెక్టర్లు, ఛైర్మన్లు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. దానివల్ల ఐఐటీల్లో నాణ్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమైనట్లు సమాచారం. కాగా నీట్, జేఈఈ మెయిన్లను కూడా సీయూఈటీలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. యూజీసీ ఛైర్మన్ ఆచార్య జగదీష్కుమార్ స్వయంగా ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సాధ్యం కాకుంటే ఇంజినీరింగ్కు ప్రత్యేకంగా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష జరిపే దిశగా కేంద్రం యోచిస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు
‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..
‣ 18 ఎయిమ్స్ కేంద్రాల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.