* పాఠశాల విద్యాశాఖ అధికారులపై ప్రవీణ్ ప్రకాశ్ అసంతృప్తి
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రాల్లో సౌకర్యాలు మరింత మెరుగుపర్చాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మూడు మూల్యాంకన కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించి.. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. గుంటూరు, బాపట్లలో పురాతన భవనాల్లో మూల్యాంకనం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గుంటూరు నగరం చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక అధునాతన విద్యా సంస్థలున్నాయి. మూల్యాంకన కేంద్రం మాత్రం పురాతన భవనంలోనే కొనసాగుతోంది. మంచి కేంద్రాన్ని సిద్ధం చేసుకోలేకపోయారు’ అని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో మూల్యాంకన కేంద్రం పెట్టడం ఏంటని డీఈఓను ప్రశ్నించారు. బాపట్ల కేంద్రం కూడా పురాతన భవనంలోనే నడుస్తోందని అక్కడి అధికారులపై మండిపడ్డారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మూల్యాంకన కేంద్రం మంచి పాఠశాలలో ఏర్పాటు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు డి.దేవానందరెడ్డి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఓ సర్క్యులర్ పంపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ప్రతి మూల్యాంకన కేంద్రంలో అత్యవసర మందులు, ప్రాథమిక వైద్య కిట్తో పాటు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని, చల్లటి నీరు సరఫరా చేయాలని, అవసరమైన చోట్ల ఎయిర్ కూలర్లు పెట్టాలని, మజ్జిగ పంపిణీ చేయాలని డీఈఓలను ఆదేశించారు.
సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా
పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా తీసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు ఏప్రిల్ 23న ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన మూల్యాంకనం 26తో ముగుస్తుందని, ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలను సందర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు
‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..
‣ 18 ఎయిమ్స్ కేంద్రాల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.