• facebook
  • whatsapp
  • telegram

BTech: బీటెక్‌ రెండో ఏడాది బ్రాంచి మార్పు రద్దు

* ఐఐటీలు, ఎన్‌ఐటీలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం
* విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే అభిప్రాయంతో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: చదువు ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వాటిని నిరోధించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్‌ తొలి ఏడాది పూర్తయ్యాక మెరిట్‌ ప్రాతిపదికన రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిలోకి మారే వెసులుబాటును రద్దు చేయాలని ఐఐటీలు, ఎన్‌ఐటీలను ఆదేశించింది. దాన్ని అమలు చేస్తూ ఐఐటీ బాంబే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ తొలి ఏడాదిలో అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిని దక్కించుకునే అవకాశముంది. అందుకు 10% సీట్లు కేటాయిస్తారు.

కొత్త విద్యా సంవత్సరంలో అమలు
విపరీతమైన పోటీ ఉండటంతో కళాశాలల్లో చేరిన నాటి నుంచే అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్థులు ఆశించింది దక్కకుంటే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే 2023-24 విద్యా సంవత్సరం నుంచి అలాంటి అవకాశాన్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. గత నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. వాటిని ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఒత్తిడికి ఒక ప్రధాన కారణమైన బ్రాంచి మార్పును రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు. ‘విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని కేంద్రం ఆదేశించింది. బ్రాంచి మార్పును రద్దు చేయాలని పరోక్షంగా సూచించినందున కొత్త విద్యా సంవత్సరంలో దాదాపు అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు అమలు చేస్తాయి’ అని ఓ ఎన్‌ఐటీ డైరెక్టర్‌ తెలిపారు.

తెలుగు విద్యార్థులపైనే అధిక ప్రభావం
దేశంలోని 23 ఐఐటీల్లోని 16,600 సీట్లలో 18% సీట్లను, 31 ఎన్‌ఐటీల్లోని 24 వేల సీట్లలో 20% సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థులే సాధిస్తున్నారు. తెలుగు విద్యార్థుల్లో కంప్యూటర్‌ సైన్స్‌పై క్రేజ్‌ అధికంగా ఉంది. అందువల్ల కేంద్రం నిర్ణయంతో మన విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.