* హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
* నేడు విచారణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూన్ 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పరీక్షలను కనీసం 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.వెంకటేశ్తోపాటు హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, జనగామ, కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన 36 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా గ్రూపు-1, 2, 3, 4 పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా నిర్వహించాల్సి ఉందని.. ఈ మేరకు మే 11న టీఎస్పీఎస్సీకి ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గ్రూప్-1 పరీక్షల నిమిత్తం గత ఏడాది సెప్టెంబరులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని, అనంతరం అక్టోబరులో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అయితే కమిషన్లోని ఉద్యోగుల వల్ల ప్రశ్నపత్రాలు లీకేజీ కావడంతో.. కేసు నమోదు చేసి సిట్ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ.. గ్రూప్-1 ప్రిలిమ్స్తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను కూడా రద్దు చేసిందన్నారు. డీఏఓ పరీక్షలో టాపర్లు కూడా లీకేజీ కేసులో నిందితులకు బంధువులున్నట్లు తెలిసిందన్నారు. అందువల్ల దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలు వెలికి తీయాలని సిట్కు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అయితే వీటిని పట్టించుకోకుండా ప్రిలిమ్స్ను జూన్ 11న నిర్వహించాలని తేదీ ప్రకటించారన్నారు. పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇందులో ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సిట్లను చేర్చారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.