• facebook
  • whatsapp
  • telegram

TSPSC QP Leak: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మరో పిటిషన్‌

అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ విషయమై సింగిల్‌ జడ్జి వద్ద ఓ పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పేపర్‌ లీకేజీ అంశంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ టీఎస్‌పీఎస్సీ కిందిస్థాయి సిబ్బందిపై కేసులు నమోదు చేసి ఉన్నతాధికారులను విస్మరించిందన్నారు.  దీనిపై ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. లీకేజీ కేసు సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ ఇప్పటికే సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.  వాదనలను విన్న ధర్మాసనం.. అభ్యంతరాలను పక్కకు పెట్టి పిటిషన్‌కు నంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గత పిటిషన్లకు దీనిని జత చేయాలని పేర్కొంది. ఇందులో ప్రతివాదులైన ప్రభుత్వ సీఎస్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, హైదరాబాద్‌ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. లీకేజీ వ్యవహారం దర్యాప్తుపై నివేదిక అందజేయాలని సిట్‌కు ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
మరో ముగ్గురి అరెస్ట్‌..
లీకేజీ కేసులో సీసీఎస్‌ పోలీసులు ఆగ‌స్టు 16న మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ బంధువులు రవి, కాంతారావు, మరో వ్యక్తి ఉన్నారు. వీరి ద్వారా ఏఈ ప్రశ్నపత్రాల విక్రయాలు జరిపినట్లు దర్యాప్తులో తేల్చారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 99కి చేరింది. కీలక నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ దరఖాస్తును నాంపల్లి న్యాయస్థానం మూడోసారి తిరస్కరించింది.

మరింత సమాచారం... మీ కోసం!

ఆర్‌ఆర్‌సీఏటీ-మధ్యప్రదేశ్‌లో 150 అప్రెంటిస్‌ ఖాళీలు

డాక్టర్ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.