• facebook
  • whatsapp
  • telegram

Students: టోఫెల్‌ అందుబాటు 3శాతం విద్యార్థులకే

*పేద విద్యార్థులందరికీ అంటూ గొప్పలే  తప్ప ప్రయోజనం లేదు..

* ఐఎఫ్‌పీ, స్మార్టుటీవీలు లేని చోట అమలుకాని శిక్షణ

ఈనాడు, అమరావతి: పేద పిల్లలకు ఆంగ్ల భాష నైపుణ్యాలు అందించేందుకు టోఫెల్‌ తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం సర్టిఫికేషన్‌ను మాత్రం కేవలం 3 శాతం విద్యార్థులకే కలిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రంలో 38.25 లక్షల మంది ఉన్నారు. వీటిల్లో టోఫెల్‌ అమలుచేస్తున్న 3 - 9 తరగతుల్లో 29 లక్షలకుపైగా ఉన్నారు. వీరిలో 20 లక్షల మంది రెడీనెస్‌ పరీక్షకు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన ప్రాథమిక పరీక్షకే 9 లక్షల మంది దూరమవుతున్నారు. రెడీనెస్‌ పరీక్ష రాస్తున్న 20 లక్షల మందిలోనూ 80 వేల మందే సర్టిఫికేట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ లెక్కన 3 శాతం మందికే టోఫెల్‌ సర్టిఫికెట్‌ అందనుంది. విద్యార్థులకు టోఫెల్‌ సర్టిఫికేషన్‌ వస్తేనే ప్రయోజనాలు చేకూరుతాయి. విషయ పరిజ్ఞానం పెంపు, ప్రపంచవ్యాప్త పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి అన్నింటికీ ఆంగ్లం మాట్లాడడమే మందులా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని బట్టిచూస్తే ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశాల్లో నిరుద్యోగ సమస్యే ఉండకూడదు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు.

టీచర్లకు శిక్షణ ఏది?

టోఫెల్‌ బోధించడానికి ఇంతవరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు. అసలు మెటీరియల్‌ను సమకూర్చడమే టెండర్ల దశలో ఉంది. ఐఎఫ్‌పీలు, స్మార్టుఫోన్లు ఉన్నవారికి ఆడియోలు పంపిస్తున్నారు. లిజనింగ్‌ పరీక్ష సన్నద్ధతకు ఆడియోప్లే చేసి విద్యార్థులు వినాల్సి ఉంటుంది. ఐఎఫ్‌పీల్లో ఆడియోలు, వీడియోలు వినిపించడమే తప్ప విద్యార్థులకు నేరుగా మార్గనిర్దేశం చేసే అవకాశాలే లేవు. ఇలాంటప్పుడు రెండో దశలో కీలకమైన స్పీకింగ్‌ పరీక్షను ఎలా నిర్వహిస్తారు? ఇంతవరకు ఎక్కడా ఈ పరీక్ష నిర్వహించనే లేదు. లిజనింగ్‌ మాత్రమే కొనసాగుతోంది.
ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా టోఫెల్‌ నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని పంపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వమే ముద్రించి విద్యార్థులకు ఇచ్చి పరీక్ష నిర్వహించాలి. సర్టిఫికేషన్‌ పరీక్షకు ఒక్కో విద్యార్థి పేరుతో విద్యాశాఖ రూ.600 చొప్పున భరిస్తోంది.

అమల్లో లోపాలెన్నో..

ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ), స్మార్టు టీవీలు ఉన్నచోటే టోఫెల్‌ శిక్షణ కొంతవరకు అమలవుతోంది. మిగతా పాఠశాలల్లో టోఫెల్‌ అమలవుతున్న దాఖలాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా 44,478 పాఠశాలలు ఉండగా, ‘నాడు-నేడు’ మొదటి విడత పనులు చేసిన 15,715 పాఠశాలల్లోనే ఐఎఫ్‌పీలు, స్మార్టుటీవీలు ఏర్పాటయ్యాయి. రెండో విడతలో పనులు చేపట్టిన బడుల్లో డిసెంబరు నాటికి వాటిని ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన ఇప్పటికైతే 35 శాతం పాఠశాలల్లోనే టోఫెల్‌ అమలు చేస్తున్నారు. మిగతా 65 శాతం బడుల్లో ప్రచారంతోనే కానిచ్చేస్తున్నారు. ఇలాంటి కార్యాచరణ వల్ల ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌)కు ప్రయోజనమే తప్ప విద్యార్థులకు కలిగే లబ్ధి కనిపించడం లేదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.