ఈనాడు, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో నిబంధనల ప్రకారమే సీట్ల భర్తీ జరిగిందని హైకోర్టు డిసెంబరు 13న స్పష్టం చేసింది. అన్ని రౌండ్ల కౌన్సెలింగులు ముగిశాక మిగిలిన 18 వైద్య సీట్ల భర్తీలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టివేసింది. కాళోజీ వర్సిటీలో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిశాక సెప్టెంబరు 27 నాటికి మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా జరిపిన ప్రవేశాలను రద్దు చేయాలంటూ ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కె.టి.సాయిరేవంత్రెడ్డి, మరో విద్యార్థి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.తిరుమలరావు వాదనలు వినిపిస్తూ.. గత రౌండ్ల కౌన్సెలింగ్లలో సీట్లు పొందిన విద్యార్థులను మిగిలిన సీట్లకు నిర్వహించే కౌన్సెలింగ్కు అనుమతించొద్దన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదన్నారు. కాళోజీ వర్సిటీ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకర్రావు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో కొనసాగుతున్నారని, మిగిలిన సీట్ల భర్తీ తరువాత కూడా వారి సీట్లలో మార్పులు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలను విని, యూనివర్సిటీ రికార్డులను పరిశీలించిన ధర్మాసనం.. సీట్ల భర్తీలో ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు రుజువు చేయలేకపోయారంది. సీట్ల భర్తీ నిబంధనల ప్రకారమే జరిగిందంటూ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ ఇగ్నోలో నాన్ టీచింగ్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.