టాస్క్ శిక్షణతో జేఎన్టీయూ విద్యార్థులకు ప్రయోజనం
న్యూస్టుడే, కమాన్పూర్ (సెంటినరీకాలనీ): ఇంటర్ వరకు కష్టపడి చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ అనే కొత్త బంగారు లోకంలోకి అడుగుపెడతారు. ఇంటర్ వరకు ఒక లెక్క అయితే ఇంజినీరింగ్ విద్య భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఇంజినీరింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులు నాలుగు సంవత్సరాలు కష్టపడి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. అయిదంకెల జీతంతో చదువు పూర్తి కాకుండానే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు. టాస్క్ ద్వారా శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకుంటూ రూ.లక్షల ప్యాకేజీలతో సత్తా చాటుతున్నారు. కళాశాల 2010లో ప్రారంభం కాగా ప్రస్తుతం ఆరు బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఇందులోనే వసతి గృహం ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగిస్తున్నారు. 2022-2023 ఏడాదికి సంబంధించి వివిధ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 42 మంది ఉద్యోగాలు సాధించారు.
ప్రత్యేక తరగతులు
ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టాస్క్లో నమోదు చేసుకున్న విద్యార్థులకు తర్ఫీదును ఇవ్వడానికి యూనివర్సిటీ శిక్షణ బృందం ఏటా ఇక్కడికి వస్తారు. ఇంజినీరింగ్ తృతీయ, చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద చర్చలు, ముఖాముఖిలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు సెల్స్ ఫోర్స్, జేఎస్డబ్ల్యూ, కోల్ ఇండియా, అప్లైడ్ మెటీరియల్స్ ప్రై.లిమిటెడ్, ఇండియా మార్ట్ ఇంటర్మేష్ వంటి కంపెనీల్లో రూ. లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కొన్ని కంపెనీలు ముందుగానే విద్యార్థులతో ఉద్యోగ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
రూ.11 లక్షల ప్యాకేజీతో..: టి.అన్వేష్, సీఎస్ఈ
మాది ఓదెల మండలం కొలనూరు. ఇంటర్ ఎంపీసీ చదవడంతో ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ కళాశాలలో సీఎస్ఈలో సీటు వచ్చింది. మొదటి ఏడాది నుంచే నైపుణ్యాలు పెంచుకున్నా. నాలుగో ఏడాదిలో వివిధ కంపెనీలు నిర్వహించిన నియామకాల్లో ఐబీఎం కంపెనీలో రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. ప్రస్తుతం పూణెలో విధులు నిర్వహిస్తున్నా.
సద్వినియోగం చేసుకున్నా..: సంజన, ఈఈఈ
మాది హనుమకొండ. కళాశాలలో శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నా. కళాశాలలో నిర్వహించిన కంపెనీ నియామకాల్లో సెల్స్ ఫోర్స్లో రూ.8.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నా.
నైపుణ్యాలు పెంచుకున్నా..: లక్ష్మీప్రియాంక, ఏంఈ
మాది వరంగల్. డిప్లొమా చదివి ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో జేఎన్టీయూలో ఎంఈలో ప్రవేశం పొందా. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నా. కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా వివిధ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నా. అప్లైడ్ మెటీరియల్ ప్రై. కంపెనీలో రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నా.
ఉద్యోగాలు సాధించేలా..: శ్రీధర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్
జేఎన్టీయూ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నాం. ఏటా కళాశాలకు కంపెనీలు వచ్చేలా యూనివర్సిటీ స్థాయిలో చొరవ చూపుతున్నాం. టాస్క్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు పెంచుతున్నాô. దీంతో వివిధ కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.