* ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. డీఎస్సీ ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6-9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15-30 రోజులపాటు బోధన కుంటుపడేది. అందుకు భిన్నంగా ఈ సారి తొలి రోజు నుంచే వారు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని.. ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. కరోనాకు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,600 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలాఖరులో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తర్వాత 2020-2021 విద్యా సంవత్సరం చివర్లో బడులు తెరిచినా విద్యా వాలంటీర్లను మాత్రం విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా నియమించలేదు. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా జరపలేదు. దీంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణులు లేక విద్యార్థులు నష్టపోయారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వారిని నియమించనున్నారు. గత ఆగస్టులోనే 5,089 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున.. మరో 4 వేల నుంచి 5 వేల పోస్టులను అదనంగా కలిపి డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ప్రక్రియ పూర్తికి 6-9 నెలల వరకు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్లో ముగియనుంది. ఆ వెంటనే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎంత మందిని నియమిస్తారన్నది అప్పటికి ఉన్న ఖాళీల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. నాలుగేళ్ల క్రితం వరకు నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఇప్పుడు వేతనం అంతే ఉంటుందా? పెంచుతారా? అన్నది ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!
‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.