* ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్య నివారణకేనన్న ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్
ఒట్టావా: తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు కెనడా ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న వాటిలో మూడో వంతు పర్మిట్లపై కోత పెట్టనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సోమవారం ప్రకటించారు. దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దం క్రితంతో పోలిస్తే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023తో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. 2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని మిల్లర్ తెలిపారు.
మాస్టర్స్, డాక్టోరల్ విద్యార్థులకు వర్తించదు..
ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని మిల్లర్ స్పష్టం చేశారు. మాస్టర్స్, డాక్టోరల్ విద్యార్థులకు తాజా పరిమితులు వర్తించవని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రావిన్స్ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు. అలాగే 2024 సెప్టెంబర్ నుంచి ‘కరికులం లైసెన్సింగ్ ఎరేంజ్మెంట్స్’ కింద నమోదు చేసుకున్న విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఇవ్వబోమని మంత్రి వెల్లడించారు.
కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. 2022లో 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం భారతీయ విద్యార్థులవే.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.