ఈనాడు, హైదరాబాద్: టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. 24,272 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్లో 44, ఏపీలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలని, ఆ తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డు, కాలేజీ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని చూపించాలి. క్యాలికులేటర్లు, లాగ్ టేబుల్స్, సెల్ఫోన్లు, డిజిటల్ వాచ్లు, ఎలక్టాన్రిక్ పరికరాలను అనుమతించరు.
Some more information
‣ "Dreams to Reality: Yasir M.'s Inspirational Success Story"