‣ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం
‣ గత సిలబసే ఉంటుందని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ మాదిరిగానే ఈసారి నీట్ ప్రశ్నపత్రంలోనూ ఛాయిస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్లో 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ వెసులుబాటు ఇచ్చింది. తాజాగా నీట్లోనూ ప్రశ్నల ఛాయిస్ ఉంటుందని కేంద్రం జనవరి 19న స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్కు కూడా గత సిలబసే ఉంటుందని తెలిపింది.
ఆఫ్లైన్లో ఎలా చేస్తారు?
జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్ష అయినందువల్ల ఛాయిస్ ప్రశ్నల్లో పరిమితికి మించి ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా సాఫ్ట్వేర్ ద్వారా నిరోధిస్తారు. నీట్ మాత్రం ఆఫ్లైన్ (పెన్ను-పేపర్) విధానంలో జరగనుంది. అప్పుడు ఎలా చేస్తారన్న ప్రశ్న వస్తోందని నీట్, జేఈఈ శిక్షణ నిపుణుడు, శ్రీచైతన్య కళాశాల డీన్ శంకర్రావు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 180 ప్రశ్నలు.. 720 మార్కుల ప్రశ్నపత్రం ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఇస్తున్నారని, దాన్ని 50కి పెంచే అవకాశం ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఛాయిస్ ఇచ్చినా కొన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నీట్కు దాదాపు 15 లక్షల మంది పోటీపడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.20 లక్షలమంది దరఖాస్తు చేస్తున్నారు. నీట్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
ఇంటర్ పాసైతే చాలు..
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్లో చేరాలంటే ఇంటర్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండేది. వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఆ నిబంధనను ఎత్తివేశారు. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్/12వ తరగతి కనీస మార్కులతో పాసైతే చాలని, జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్ ర్యాంకులతో ప్రవేశాలు పొందొచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దాన్ని వచ్చే సంవత్సరానికి కూడా పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.