• facebook
  • whatsapp
  • telegram

పదో త‌ర‌గ‌తి పరీక్ష గట్టెక్కేదెలా..?

ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తికాని పాఠ్యాంశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా మార్చి 24 నుంచి విద్యాసంస్థలు మూసేశారు. మళ్లీ తెరుస్తారో.. లేదోనన్న అయోమయం.. పూర్తికాని పాఠ్యాంశాలు తదితర ఇబ్బందుల నడుమ పదో తరగతి పరీక్షలు ఎలా రాయాలనే ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సందిగ్ధంతో ఉన్నారు. డిజిటల్‌ తరగతుల ద్వారా బోధన సజావుగా సాగకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మే 17 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించి సమయసారిణి (టైంటేబుల్‌)ని విడుదల చేసింది. విద్యాసంస్థలు మూతపడడంతో కేవలం డిజిటల్‌ తరగతులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి 9, 10 తరగతులకు ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతి గది బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. నెలన్నరపాటు కొనసాగించింది. తొలుత విద్యార్థుల హాజరు సరిగా లేకపోవడంతో బోధన సరిగా సాగలేదు. ఆ తరవాత ఊపందుకున్నా తగినన్ని రోజులు తరగతులు జరగకపోవడంతో సిలబస్‌ పూర్తి కాలేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 33,350 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు విభాగంలో 1,08,768 మంది విద్యార్థులున్నారు.


‣ అసంపూర్తిగా సిలబస్‌

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో ఐదు రోజులపాటు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలు ప్రసారమవుతున్నాయి. ఈ పాఠాలు చూసే విషయంపై తొలుత ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ, రాన్రాను కొరవడింది. పదో తరగతిలో 70 శాతం మాత్రమే పాఠాలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. డిజిటల్‌ తరగతుల్లో 50-60 శాతం పూర్తయ్యిందని చెబుతోంది. 40-50 శాతం మాత్రమే పూర్తయ్యిందని ఉపాధ్యాయులు అంటున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో బోధన కారణంగా సిలబస్‌ పూర్తయింది. సర్కారీ బడుల్లో పూర్తిచేసిన 50 శాతం సిలబస్‌తో పరీక్షలు రాయడమెలాగని విద్యార్థులు, తల్లిదండ్రులు  ప్రశ్నిస్తున్నారు.
 

‣ ప్రత్యక్ష బోధన అనుమానమే!

కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడం అనుమానమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రత్యక్ష బోధన ఎంతవరకు సాగుతుందనేది అయోమయంగా మారింది. ఇప్పటివరకు కేవలం ఎఫ్‌ఏ (ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 మాత్రమే పూర్తయింది. దీనికి విద్యార్థులు చాలా మంది హాజరు కాలేదు. ‘‘మే 17 నుంచి పరీక్షలు నిర్వహించకపోతే మే నెలాఖరుకు వాయిదా పడే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఇంటర్‌ పరీక్షలు ఉన్నందున ప్రభుత్వం వాటిని నిర్వహిస్తుందా.. లేదా తెలిస్తే పది పరీక్షలపైనా స్పష్టత వస్తుంది’’ అని ప్రధానోపాధ్యాయుడు ఒకరు తెలిపారు.


అభ్యాసన దీపిక అందిస్తున్నాం

- మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు, కౌకూర్‌

మాకందిన షెడ్యూల్‌ మేరకు సిద్ధమవుతున్నాం. పదో తరగతి విద్యార్థులకు నమూనా ప్రశ్నపత్రాలు, ఎస్‌ఈఆర్‌టీ నుంచి వచ్చిన అభ్యాసన దీపికలను పంపి సాధన చేయిస్తున్నాం.


అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి
- ముత్యాల రవీందర్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు


డిజిటల్‌ బోధన జరుగుతున్నా పెద్దసంఖ్యలో విద్యార్థులు విద్యకు నోచుకోవడం లేదు. బోధనాభ్యాస ప్రక్రియ అసమగ్రంగానే సాగుతోంది. విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితులున్నాయి. అంతర్గత మూల్యాంకనం అసంపూర్తిగా ఉంది. పది పరీక్షల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, విద్యావేత్తలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి.

తెలుగు మీడియం స్ట‌డీ మెటీరియ‌ల్
గ‌ణితం
 భౌతికర‌సాయ‌న‌ శాస్త్రం
 జీవ‌శాస్త్రం
 సాంఘిక శాస్త్రం 
ENGLISH MEDIUM STUDY MATERIAL
MATHEMATICS
PHYSICS
BIOLOGY
SOCIAL STUDIES

Updated Date : 12-04-2021 10:25:02

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం