* గిరిజన సంక్షేమశాఖ వినూత్న నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: కరోనా కారణంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఉండడానికి గిరిజన సంక్షేమశాఖ వినూత్న ప్రణాళిక సిద్ధం చేసింది. తమ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల వద్దకే టీచర్లు వెళ్లి పాఠాలు బోధించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ఒప్పంద ఉపాధ్యాయులకు గ్రామాలతో పాటు విద్యార్థులను దత్తత ఇవ్వనుంది. ఒక్కో ఉపాధ్యాయుడు ప్రతిరోజూ రొటేషన్ పద్ధతిలో ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి రెండు గంటల చొప్పున పాఠాలు బోధించాలని సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీవీలు, స్మార్ట్ఫోన్లు ఉన్నవారికి టీశాట్, దూరదర్శన్ ఛానళ్లలో ప్రసారమయ్యే పాఠాలు వినిపించాలని పేర్కొంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలు అందించాలని కోరింది. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సమాన సంఖ్యలో గ్రామాలను దత్తత ఇచ్చి ఆ గ్రామాల్లో పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
పరీక్ష.. ప్రత్యేక రక్ష
క్యాటరింగ్ టెక్నాలజీలో చివరి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న తమ విద్యార్థుల కోసం బేగంపేటలోని కలనరీ అకాడమీ కళాశాల ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది . కొవిడ్ దృష్ట్యా ప్రతి విద్యార్థికి విడివిడిగా పాలిథిన్ కాగితం, చెక్కతో తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసింది. వాటిలో కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించింది.