* ఐఐటీ, ఎన్ఐటీ, సాంకేతిక విద్యా సంసల్లో ప్రవేశాలు
తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్టుడే: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) అక్టోబరు 06 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించింది. జేఈఈలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆయా సంస్థల్లోని కోర్సుల కోసం అక్టోబరు 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఆరు విడతల్లో (నవంబరు 7న) జరగనుంది. మొదటి విడత సీట్ల కేటాయింపును అక్టోబరు 17న ప్రకటిస్తారని ఏపీ నిట్ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఏపీ నిట్లో పెరిగిన సీట్లు
ఏపీ నిట్ను 2015లో తాడేపల్లిగూడెంలో ప్రారంభించారు. మొత్తం ఎనిమిది కోర్సులకు గాను 480 సీట్లను కేటాయించారు. ఇవికాకుండా ఈ ఏడాది నుంచి సూపర్ న్యూమరరీ కింద మరో 120 సీట్లు పెరుగుతున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 600కి చేరింది. ఇందులో 300 చొప్పున (50 శాతం సీట్లు) రాష్ట్ర విద్యార్థులతో, మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేయనున్నారు.