• facebook
  • whatsapp
  • telegram

అస్తవ్యస్తంగా ఇంటర్‌ ప్రవేశాలు

* ఆన్‌లైన్‌లో కనిపించని అనేక ప్రైవేటు విద్యాసంస్థలు
* సమస్యపై దృష్టి సారించని అధికారులు


ఈనాడు - అమరావతి: రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణులు కాగా.. కేవలం రెండు లక్షల మందే ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మరి మిగతావాళ్లంతా ఏమయ్యారు? వాళ్లే చేరడం లేదా..? లేక రాష్ట్రంలో వారు చేరడానికి కాలేజీలు అందుబాటులో లేవా? పరిస్థితి చూస్తే జూనియర్‌ కాలేజీల లభ్యతే అసలు సమస్యగా అర్థమవుతోంది. వాస్తవానికి కరోనా కారణంగా పదో తరగతిలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడంతో ఇంటర్‌లో ప్రవేశాలు పెరగాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
 

అసలు కారణం...
వాణిజ్య భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నారని, పక్కా భవనాలు లేవనే కారణాలతో తొలుత 600 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు ఇంటర్‌ విద్యామండలి అనుమతులు నిలిపివేసింది. తాజాగా వాటిలో 250 కళాశాలలకు అనుమతులిచ్చి, వాటిని ఆన్‌లైన్‌లో చేర్చారు. అయినా ఇప్పటికీ సుమారు 350 వరకు కళాశాలలకు అనుమతి రాలేదు. ఇలా ఇంకా అనుమతి రానివాటిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ కళాశాలలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియట్‌లో ఎక్కడ చేర్పించాలనే విషయమై ఒత్తిడికి గురవుతున్నారు. నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ లాంటి పోటీ పరీక్షల్లో పిల్లలకు మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు వాటికి శిక్షణ ఇచ్చే ప్రైవేటు జూనియర్‌ కాలేజీలవైపు చూస్తుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలలో.. అలాంటి కళాశాలలకు తక్కువ సంఖ్యలో అనుమతులు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఎక్కువమంది హైదరాబాద్‌లోను, రాయలసీమ జిల్లాల వారు బెంగళూరులోను తమ పిల్లలను చేర్చే ప్రయత్నాల్లో పడ్డారు.
కొందరు మాత్రం తామున్నచోట ప్రైవేటు కళాశాలలు ఆన్‌లైన్‌లో కనపడతాయేమోనని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు రాష్ట్రంలో అనుమతులున్న జూనియర్‌ కళాశాలలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే కనీస సమాచారాన్ని కూడా ఇంటర్‌ విద్యామండలి ఇంతవరకు అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాలను నిర్వహిస్తున్న విషయమై అధికారులు సరిగా ప్రచారం చేయలేదు. దీంతో అవగాహన లేని తల్లిదండ్రులు పాత విధానంలోనే ఇప్పటికే తమ పిల్లలను వివిధ కళాశాలల్లో చేర్పించారు. ఇంటర్‌తోపాటు ఐఐటీ శిక్షణ కోసం ముందునుంచే బోధన ఉండటంతో జూన్‌, జులై నెలల్లోనే రుసుములు చెల్లించి పిల్లలను చేర్పించారు. వీరికి ఆన్‌లైన్‌ తరగతులు మొదలైపోయాయి కూడా. కానీ ఇప్పుడా కళాశాలల్లో కొన్ని మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కంటే ఎక్కువ శాఖలున్న ప్రైవేటు కళాశాలలు 306 ఉండగా.. పాతవిధానం ప్రకారం వీటిలో 2.50 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. కానీ వాటిలో చాలా కాలేజీలకు ఇప్పుడు అనుమతులు లేవు. దాంతో ఆ సీట్లన్నీ గల్లంతయినట్లేనా అని, తమ పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
* ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులు 6.31 లక్షలు
* మొదటి సంవత్సరంలో ఏటా ప్రవేశాలు  5 లక్షలు
* తొలివిడత కౌన్సెలింగ్‌కు ఆసక్తి చూపినవారు  2 లక్షలు
* కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చినవారు 1.20 లక్షలు

ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లేరీ?
పలు కళాశాలలకు అనుమతులు నిలిపివేసిన అధికారులు.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించలేదు. పోనీ.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏమైనా ప్రైవేటుకు దీటుగా ఉన్నాయా అంటే, అదీ లేదు. బోధన సిబ్బంది కొరత వల్ల వాటిలో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ కళాశాలలకు 4,800 మంది అధ్యాపకులు అవసరం. కానీ శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు 700 మంది లోపే! 84 ప్రభుత్వ కళాశాలలకు శాశ్వత లెక్చరర్లే లేరు. ఇలాంటి చోటుకు పిల్లల్ని పంపి, వారి భవిష్యత్తును పణంగా పెట్టేదెలాగన్నది తల్లిదండ్రుల ప్రశ్న.
 

అక్కడ ఇబ్బంది లేదు..
పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో అదనపు సెక్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చినా, వారందరినీ చేర్చుకునేందుకూ అవకాశం ఉందని అంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్‌ లాంటి నగరాలకు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.