* కరోనా నేపథ్యంలో మార్పు
ఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి మాత్రమే ఈ విధానమంటూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆరు ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను మాత్రమే పెంచే అవకాశం ఉంది. గతంలో ఒక్కో పేపర్ 50మార్కులకు ఉండగా ఇప్పుడు ఒక్క పేపరే వంద మార్కులకు నిర్వహించనున్నారు.
పరీక్ష సమయం పెంపు..
వంద మార్కులకు ఒకే పేపర్ను ప్రవేశపెడుతున్నందున పరీక్ష వ్యవధిని అర్ధగంట పెంచే అవకాశం ఉంది. ఈసారి ఐదు నెలల తర్వాత నవంబరులో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో పదోతరగతి పాఠ్య ప్రణాళికను 30శాతం వరకు కుదించారు. పాఠ్యాంశాలను మూడు కేటగిరీలుగా విభజించారు. తరగతి గది, ఇంటి వద్ద నేర్చుకునేది, ఐచ్ఛికంగా నేర్చకునేదిగా ఇచ్చారు. తరగతి గది, ఇంటి వద్ద నేర్చుకునే పాఠాల నుంచే ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్ సిద్ధమైతే గాని, ప్రశ్నపత్రాల నమూనాలపై స్పష్టత రాదు. గతంలో బిట్ పేపర్, అంతర్గత మార్కులు తొలగించి రాత పరీక్షకే వంద మార్కులు ఇచ్చేలా మార్పు చేశారు. ఈ విధానంపై ప్రకటన చేసినా కొవిడ్-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈ విధానంలోనే ప్రశ్నలు ఇవ్వడమా? కరోనా నేపథ్యంలో విద్యార్థుల అభ్యాసన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మార్పు చేయడమా? అనేదానిపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ లేదా మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.