• facebook
  • whatsapp
  • telegram

‘పది’లో ఆరు పేపర్లే!

* పాఠశాల విద్యాశాఖ యోచన
* సంక్రాంతి తర్వాత బడులు తెరిచేందుకు కసరత్తు 

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటివరకు ఉన్న 11 పరీక్షలను ఆరుకు కుదించాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. పదో తరగతికి తప్పనిసరిగా ఏదో ఒక రూపేణా పరీక్షలను నిర్వహించాలన్నది విద్యాశాఖ నిర్ణయం.  మే నెల మధ్య నుంచి పరీక్షలను ప్రారంభించాలని రెండు నెలల క్రితమే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకు విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమైనందున గతంలో మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే ఒత్తిడికి గురవుతారని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది వరకు హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టుల్లో ఒక్కోదానికి రెండు పేపర్లు ఉండేవి. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష జరపాలన్నది యోచన. అంతేకాకుండా ప్రశ్నల్లో ఛాయిస్‌తోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్య కూడా పెంచనున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే చిత్రా రామచంద్రన్‌ ఆదేశించారు. ఈ క్రమంలోనే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులున్నారు. బడులు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

* పండగల తర్వాతే?...
బడులు తెరవడంపై విద్యాశాఖ ఆలోచనలు, ప్రతిపాదనలు మారుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి తర్వాత 9, 10, ఇంటర్‌ తరగతులకు విద్యాసంస్థలను తెరిచి ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. డిసెంబ‌రు ఆఖరు వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే తెరిసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపడేయం లేదు. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఉన్నతస్థాయి విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత వెంటనే తెరిచినా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ప్రారంభానికి దాదాపు 4 నెలల సమయం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏయే రాష్ట్రాల్లో బడులు తెరిచారో అధికారులు సేకరించారు. ఇప్పటివరకు దేశంలో ఏడు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను తెరిచారని చెబుతున్నారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.