* మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
నూజివీడు, న్యూస్టుడే: రాష్ట్రంలోని ట్రిపుల్ఐటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేలా తయారు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీలో 2020-21 విద్యా సంవత్సర ఆర్జీయూకేటీ ప్రవేశాల ప్రక్రియను జనవరి 4న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కళాశాలలో శిక్షణ ఇప్పించి, వారి ఉద్యోగ అవకాశాల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. కులపతి ఆచార్య కె.సి.రెడ్డి మాట్లాడుతూ... ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జనవరి 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. సెట్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు శివశంకర్ (ప్రొద్దుటూరు, కడప జిల్లా), యుగంధర్ (రాజాం, శ్రీకాకుళం జిల్లా), అభిషేక్ (టెక్కలి, శ్రీకాకుళం జిల్లా)లకు ప్రవేశ పత్రాలను అందజేశారు.