* ఏఐసీటీఈ స్పష్టీకరణ
దిల్లీ: దూర విద్య ద్వారా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 2011-12 వరకు ఇచ్చిన బీటెక్, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు చెల్లుబాటు అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. దూర విద్య ద్వారా ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని యూజీసీ చెప్పడంతో వాటిని నిలిపివేసింది. అయితే 2009-10 విద్యాసంవత్సరంలో పేర్లు నమోదు చేసుకున్నవారిని కొనసాగించాలని, వారి డిగ్రీలను ఆమోదించాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు 2010-11, 2011-12 సంవత్సరాల్లో చదివిన వారిని చివరి బ్యాచీలుగా పరిగణిస్తూ కొంత వెసులుబాటు కూడా ఇచ్చింది. ఈ కారణంగా 2011-12 బ్యాచీ విద్యార్థుల డిగ్రీలు సక్రమమైనవిగా ఏఐసీటీఈ పరిగణించనుంది.