* రెండు సెక్షన్లలో అమలు
* ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న బోర్డు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఈసారి ఛాయిస్ 50 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్బోర్డు ప్రతిపాదనలు పంపనుంది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్న బోర్డు అధికారులు ఛాయిస్ పెంపుపై ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో, ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెక్షన్లు ఉండగా.. రెండింటిలో 50 శాతం ఛాయిస్ ఇవ్వనున్నారు. అంటే వాటిలో సగం ప్రశ్నలకే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఒకటి లేదా రెండు ప్రశ్నలు మాత్రమే ఛాయిస్ కింద అధికంగా ఇచ్చేవారు.
గణితంలో ఛాయిస్ ఇలా..
సెక్షన్లు - ఇప్పటివరకూ - జరగబోయే పరీక్షల్లో
సెక్షన్-ఏ - 10కి 10 రాయాలి - మార్పు లేదు
సెక్షన్-బి - 7 ప్రశ్నలకు 5 - 10కి 5
సెక్షన్-సి - 7కి 5 - 10కి 5
(సెక్షన్-ఏలో ఒక్కో దానికి 2 మార్కులు, సెక్షన్-బిలో 4 మార్కులు, సెక్షన్-సిలో 7 మార్కులు)
మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు తరగతులు
* ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకొనేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్పై ఆన్లైన్లో అయిదారు తరగతులు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. కెరీర్ గైడెన్స్పైనా అవగాహన కల్పించనుంది.
* ఓ విద్యార్థి ఏ రంగంలో రాణించేందుకు అవకాశం ఉందో గుర్తించి సలహా ఇచ్చేందుకు సైకోమెట్రిక్ పరీక్ష జరపాలని అధికారులు భావిస్తున్నారు. ఎంపిక చేసిన 10 కళాశాలల్లో ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు నిజాయతీగా సమాధానం ఇస్తే ఎవరు ఏ రంగంలో రాణిస్తారో విశ్లేషించి నిపుణులు తగిన సలహా ఇస్తారు. గత విద్యా సంవత్సరం మోడల్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్ పరీక్షలు జరిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.