• facebook
  • whatsapp
  • telegram

‘పది’ ప్రశ్నపత్రాల్లో మరింత ఛాయిస్‌!  

* బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు మినహా అన్నింట్లో పెంచాలని నిపుణుల కమిటీ సిఫారసు

* ప్రభుత్వానికి చేరిన పాఠశాల విద్యాశాఖ నివేదిక 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల్లో మార్పులపై సూచనలకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను నియమించింది. ఆ కమిటీలు ఛాయిస్‌ పెంపు, ఇతర సిఫారసులతో నివేదికలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనకు అందజేశాయి. తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆమె తాజాగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే 11 పరీక్షలకు బదులు ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష నిర్వహించేలా పరీక్షల కాలపట్టికను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఒక మార్కు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను మినహాయించి మిగిలిన ప్రశ్నలకు మరింత ఛాయిస్‌ పెంచాలని తాజాగా కమిటీలు సిఫారసు చేసినట్లు తెలిసింది. వాటికి ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.  
2015లో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని అమలు చేస్తూ అందులో నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)లు జరపాలని అప్పట్లో ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఈసారి రెండు ఎఫ్‌ఏలే ఉంటున్నందున ప్రభుత్వం ఆ జీఓలో సవరణలు చేయాల్సి ఉంటుంది. 11కు బదులు ఆరు పేపర్లు, సైన్స్‌లో రెండు ప్రశ్నపత్రాలపైనా జీవోలో సవరణలు చేయనున్నారు.

సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల్లోనూ...

* సీబీఎస్‌ఈ సైతం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో కొత్త ఒరవడిని తీసుకువస్తోంది. అసలైన విద్యా సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నల శాతాన్ని ఏటా పెంచుతోంది. కేస్‌ స్టడీలు ఇచ్చి అందులో నుంచి ప్రశ్నలు అడగడం, పరిష్కారం చూపమనడం లాంటివి ఇస్తున్నారని విజ్ఞాన్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ వందన తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను సమగ్రంగా చదవడం లేదని భావించిన సీబీఎస్‌ఈ ఈసారి వాటిలోని పేరాగ్రాఫ్‌లను యథావిధిగా ఇచ్చి ప్రశ్నలు అడగనుందని ఆమె చెప్పారు. 

* 2019-20 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి గణితంలో రెండు రకాల ప్రశ్నపత్రాలు(ప్రాథమిక, ప్రామాణికం) ఇవ్వడాన్ని సీబీఎస్‌ఈ ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి ఆంగ్లం, సంస్కృతంలోనూ రెండు రకాల ప్రశ్నపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటర్‌లో సైన్స్‌ కోర్సుల వైపు వెళ్లాలనుకున్న వారికి ప్రాథమిక ఆంగ్లం సరిపోతుందన్న ఉద్దేశంలో సీబీఎస్‌ఈ ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date : 28-01-2021 12:01:31

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం