• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీటెక్‌తో పాటు ఉద్యోగం!

ఎంపికైతే చాలు.. ఉచితంగా బీటెక్‌ విద్య అందిస్తారు. పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. కోర్సు పూర్తయిన తర్వాత జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ పట్టా చేతికందిస్తుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయల వేతనం! ఈ అవకాశం జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా దక్కుతుంది. ఇందుకోసం భారతీయ నౌకాదళం 10+2 టెక్‌ ఎంట్రీ ప్రకటన వెలువడింది. 
 


ప్రకటించిన ఖాళీలు మొత్తం 34. వీటిలో 29 ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌లో, 5 ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 2, 2001 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ -2020లో అర్హత సాధించినవారై ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

జేఈఈ-2020 మెయిన్‌లో సాధించిన ర్యాంకు ద్వారా దరఖాస్తులను షార్ట్‌ లిస్టు చేస్తారు. వడపోతలో నిలిచినవారికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఏదో ఒక చోట నవంబరు నుంచి జనవరిలోగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారికి తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీ లో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.

శిక్షణ ఇలా..
ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జనవరి 2021 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారం అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. 

చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచి కేటాయిస్తారు. వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 అందుతుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలుపుకుని గరిష్ఠంగా రూ.లక్ష వరకు వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు..మొదలైన రాయితీలెన్నో పొందవచ్చు. 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు లభిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 6 నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 20
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in
 

Posted Date : 28-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌