పరిశోధన అంటే మాటలు కాదు కదా.. ఎన్నో పుస్తకాలను రిఫర్ చేసి అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీనికి ఎంతో సమయాన్నీ, డబ్బునూ వెచ్చించాలి. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇది మరింత కష్టం కూడా. ఈ నేపథ్యంలో పరిశోధకులకు అన్ని విధాలా చేయూతను అందిస్తోంది ‘రిసెర్చర్.లైఫ్’ అనే అంకుర సంస్థ.
ఒకే రంగంలో పనిచేసేవారికి మాత్రమే ఆ రంగంలోని కష్టనష్టాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పరిశోధకులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తోందీ సంస్థ. దీంట్లో ఇప్పటివరకు సమారు లక్షమంది పరిశోధకులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఒకరితో మరొకరు తమ ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పిస్తోంది.
ఎలాంటి సేవలు అందిస్తారంటే...
పరిశోధనా క్రమంలో చాలామందికి ఎన్నో సందేహాలూ వస్తుంటాయి. ఏయే పేపర్లు, పుస్తకాలు చదవాలి? కావాల్సిన సమాచారం ఏయే గ్రంథాలయాల్లో, ల్యాబ్లలో దొరుకుతుంది? పరిశోధనకు అవసరమైన ఆర్థిక సహకారం ఎక్కడ లభిస్తుంది?... మొదలైన వాటికి అవసరమైన అన్ని సేవలనూ ఈ సంస్థ అందిస్తోంది. దీని ద్వారా పరిశోధకులు 80 శాతం సేవలను ఉచితంగానే పొందొచ్చు.
‘కొవిడ్ ఆధారిత పరిశోధనలు చేసేవారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాబ్లన్నీ మూతబడ్డాయి. అందుకే వీరంతా డేటా కలెక్టర్స్తో కలిసి పనిచేసేలా చేస్తున్నాం. ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న కొందరికి మానసికారోగ్యం కోసం ఆరోగ్య శిబిరాలనూ ఏర్పాటుచేశాం. ఎప్పటికప్పుడ తగిన మార్గదర్శకాలనూ అందిస్తున్నాం. వైరాలజిస్ట్లు, ఇమ్యునాలజిస్ట్లు, పర్మనాలజిస్ట్లు, పాథాలజిస్ట్లు.. మిగిలిన వారు ఒకరికొకరు సహకరించుకుంటూ పరిశోధనలు పూర్తిచేసే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే వీరందరికీ సకాలంలో ఆర్థిక సహకారం అందేలా చూస్తున్నాం’ అంటున్నారు సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ దినా ముఖర్జీ.
పూర్తి సమాచారం కోసం https://researcher.life/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.