• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగాలు అడగం... ఇస్తాం!

తెలుగు రాష్ట్రాల్లో నవయువ పారి‘శ్రామికులు’

వారి వయసు 25 నుంచి 30 ఏళ్లు... పేద, మధ్యతరగతి కుటుంబాల వారు. ఉన్నత చదువులు చదివారు. వినూత్న ఆలోచనలే వారి పెట్టుబడి. ఆత్మవిశ్వాసం, మనో ధైర్యంతో.. ఎంతో ఇష్టంగా పారిశ్రామిక రంగంలో ప్రవేశిస్తున్నారు. ముందున్నది ముళ్లబాటే అయినా ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపిస్తున్న వారిలో 40 శాతానికి పైగా యువతే. బ్యాంకు రుణాలు, ఇతర వనరుల ద్వారా పరిశ్రమల్ని స్థాపిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమల్ని స్థాపిస్తున్న వారిలో యువత 60 శాతం ఉన్నారు. వీరిలో కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారు 45 శాతం పైనే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో 60 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానంలో ప్రారంభమైన 14 వేల పరిశ్రమల్లో యువత భాగస్వామ్యమే అధికం. ప్రత్యేక కథనం ..

నీ వయసు?

- 25 ఏళ్లు

పరిశ్రమ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు?

- నేను పనిచేయడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని.

ఆస్తులున్నాయా?

- మా నాన్న ఆటోడ్రైవర్‌.

మరి పరిశ్రమ ఎలా పెడతావు?

- బ్యాంకు రుణంతో.

అనుభవం ఉందా?

- లేదు. తెచ్చుకుంటాను.

నష్టపోతే?

- ఆ పరిస్థితి రానీయను.

... హైదరాబాద్‌లోని ఒక జాతీయ బ్యాంకు రుణం కోసం వెళ్లిన యువకుడికి సిబ్బంది ప్రశ్నలు వేయగా.. అతను సడలని సంకల్పంతో ఇచ్చిన  సమాధానాలివి.

పారిశ్రామిక రంగం దేశ ఆర్థికవ్యవస్థకు ఆయువుపట్టు.. ఉపాధికి పర్యాయపదం. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... క్లిష్టమైనది. పెట్టుబడులు, మూలధనం, ఉత్పత్తి, మార్కెటింగ్‌, వినియోగం, ఉపాధి, ఎగుమతులు, దిగుమతులు... తదితరాలతో ముడిపడింది. నష్టాలు, కష్టాలు, రుణాలు, దివాలా, జప్తు, మూసివేతలు, తీసివేతలు, కాలుష్యం... వంటివి భయపెడతాయి. అయినా ఎంతో ఆసక్తితో, ధైర్యసాహసాలతో తెలుగురాష్ట్రాల్లోని యువత ముందుకొస్తోంది. పరిశ్రమలతో ఎలాంటి సంబంధమూ లేని కుటుంబాలకు చెందిన యువతీయువకులూ సరికొత్త బాధ్యతల్ని తలకెత్తుకుంటున్నారు. సొంతంగా ఎదగడం, జీవితంలో స్థిరపడటం వంటి లక్ష్యాలతో పారిశ్రామిక రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే... తామే ఉపాధి కల్పించాలనే భావన వీరిది.

పారిశ్రామిక రంగం దేశ ఆర్థికవ్యవస్థకు ఆయువుపట్టు.. ఉపాధికి పర్యాయపదం. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... క్లిష్టమైనది. పెట్టుబడులు, మూలధనం, ఉత్పత్తి, మార్కెటింగ్‌, వినియోగం, ఉపాధి, ఎగుమతులు, దిగుమతులు... తదితరాలతో ముడిపడింది. నష్టాలు, కష్టాలు, రుణాలు, దివాలా, జప్తు, మూసివేతలు, తీసివేతలు, కాలుష్యం... వంటివి భయపెడతాయి. అయినా ఎంతో ఆసక్తితో, ధైర్యసాహసాలతో తెలుగురాష్ట్రాల్లోని యువత ముందుకొస్తోంది. పరిశ్రమలతో ఎలాంటి సంబంధమూ లేని కుటుంబాలకు చెందిన యువతీయువకులూ సరికొత్త బాధ్యతల్ని తలకెత్తుకుంటున్నారు. సొంతంగా ఎదగడం, జీవితంలో స్థిరపడటం వంటి లక్ష్యాలతో పారిశ్రామిక రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే... తామే ఉపాధి కల్పించాలనే భావన వీరిది.

ముందుకే అడుగు...
పారిశ్రామిక రంగంలో ప్రయాణం అంత సులభమేమీ కాదు. అయినా యువతీ యువకులు అంకుర ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఆరంభంలో సమస్యలొచ్చినా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటున్నారు. ఆవిష్కరణల్లో కొత్తదనానికి కృషి చేస్తున్నారు. కరోనా సమయంలోనూ తమ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తూ... ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు.

‘ప్రపంచంలో ఎన్నో ఆలోచనలున్నాయి. వాటిని అమలుచేసే ధైర్యం కొంతమందికే ఉంది. ఇది సరైనదేనని నమ్మకం కలిగిన రంగంలోకే యువత ప్రవేశించాలి. యువ పారిశ్రామికవేత్తలు వైవిధ్యం కోసం ప్రయత్నించాలి. అవకాశాల్ని అందిపుచ్చుకొని ప్రతిభ చాటాలి. మంచి, ఉత్తేజకర ప్రారంభమే కాదు కష్టనష్టాల్ని తట్టుకునేందుకూ సిద్ధంగా ఉండాలి. ఆశించిన దానికంటే ఎక్కువ శ్రమించాలి. మా బ్రాండ్‌ను చూస్తే విజయమే కనిపిస్తుంది... అందులో మేం ఎదుర్కొన్న సవాళ్లూ ఉన్నాయని యువత గుర్తించాలి’

- రతన్‌టాటా, పారిశ్రామిక దిగ్గజం

సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలని...

- ఎడ్లపల్లి నిశాంత్‌ , శబరి ప్యాకేజింగ్‌, చర్లపల్లి

బీటెక్‌ పూర్తయ్యాక జర్మనీకి వెళ్లి మంచి జీతంతో ఉద్యోగంలో చేరా. ఆ దేశంలోని అభివృద్ధి నన్ను ఆలోచింపజేసింది. నా వంతుగా సొంత రాష్ట్రానికి, దేశానికి ఏదైనా చేయాలనిపించింది. వెంటనే హైదరాబాద్‌ వచ్చేశా. ప్యాకేజింగ్‌పై రెండు నెలల పాటు అధ్యయనం చేసి పరిశ్రమను స్థాపించా. ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగా. ప్రస్తుతం మా పరిశ్రమలో 121 మంది యువత పనిచేస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీలో కొత్త పరిశ్రమ సిద్ధమైంది. అందులో 100 మందికి ఉద్యోగాలిచ్చా.

పోటీ తట్టుకుని...

- నిఖితారెడ్డి, టకీడ్రైవ్‌ ఇండస్ట్రీస్‌, హైదరాబాద్‌

ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ చదివా. ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చినా... సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పరిశ్రమల గురించి అధ్యయనం చేశా. ఆటోవేరియల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్టెబిలైజర్లు, టెస్టింగ్‌ల్యాబ్‌ పరికరాల తయారీ పరిశ్రమ ప్రారంభించి, 15 మందికి ఉపాధిని కల్పించా. మొదట్లో పెట్టుబడి కోసం రుణం దొరకడం కష్టమైంది. కొత్త కావడంతో నిర్వహణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. నేను తప్పక విజయం సాధిస్తానని ధైర్యంగా చెప్పా. ఉత్పత్తులు ప్రారంభమయ్యాక మార్కెటింగ్‌ సమస్యగా మారింది. పరికరాల నాణ్యతను వివరిస్తూ కొనుగోలుదారుల్లో నమ్మకం కలిగించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పేరొందిన ట్రాన్స్‌ఫార్మర్ల పరిశ్రమలో మాదీ ఒకటి. చైనా ఉత్పత్తులు నిలిచిపోవడం, రాగి ధరలు పెరగడం, కరోనా... ఇలా కొన్ని ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తాం.

ఆ మాట చెప్పి వచ్చేశా...

- నూకల గౌతంరెడ్డి, సఫల్‌ ఫార్మా, చెంగిచెర్ల

ఎంఫార్మసీ చదివా. ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరా. అక్కడ ఆంక్షలు ఎక్కువ. సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల నా ప్రతిభను పూర్తిస్థాయిలో చాటలేకపోయా. ఓరోజు యజమాని దగ్గరకు వెళ్లి.. ‘సర్‌, ఉద్యోగం మానేస్తున్నా. నేనే ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనుకుంటున్నా’ అనిచెప్పి వచ్చేశా. హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో ఔషధ పరిశ్రమ స్థాపించి, 30 మందికి ఉద్యోగాలు ఇచ్చా. ఆరంభంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. భారీ పెట్టుబడులకు పోకుండా అందుబాటులో ఉన్న డబ్బుతోనే ఒక్కో ఉత్పత్తిని ప్రారంభిస్తూ ముందుకెళ్లా. మేం తయారు చేసే ఔషధాల సంఖ్య 140కి చేరింది. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, బిహార్‌, బెంగాల్‌, తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. త్వరలో దండుమల్కాపూర్‌లో మరో పరిశ్రమను పెట్టబోతున్నా.

సౌదీ నుంచి వచ్చి...

- అసిఫ్‌ రబ్బాని, మెటల్‌ ఆర్ట్‌ వర్క్స్‌, విజయవాడ

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివా. ఉపాధి కోసం సౌదీ వెళ్లా. నెలకు రూ.90 వేల జీతంతో ఉద్యోగం పొందా. కొంతకాలం తర్వాత ఆ సంస్థ ఆర్థికంగా దెబ్బతిన్నది. అక్కడి నుంచి విజయవాడ వచ్చేశా. సౌదీలో సంపాదించిన దానికి బ్యాంకు రుణాన్ని జోడించి, రూ.20 లక్షలు పెట్టుబడి సమకూర్చుకున్నా. ఆటోనగర్‌లో ‘మెటల్‌ ఆర్ట్‌ వర్క్స్‌’ పేరిట యంత్ర విడిభాగాల తయారీ మొదలుపెట్టా. పరిశ్రమల నిర్వాహకుల్ని కలిసి ఉత్పత్తుల గురించి వివరించా. నన్ను నమ్మి ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పుడు రోజుకు 1.5 మెట్రిక్‌ టన్నుల బరువు గల విడిభాగాల్ని తయారు చేసి, అన్ని జిల్లాలకూ పంపిణీ చేస్తున్నాం.

ధైర్యంగా ముందడుగు

- సుధార్చన, శ్రీసాయిసుధ కార్గేటెట్‌ పరిశ్రమ, విజయనగరం

చదువు పూర్తయ్యాక పరిశ్రమ స్థాపించాలనుకున్నా. అనుభవం లేదు. మామిడి ఎగుమతి కోసం అవసరమైన అట్టపెట్టెల తయారీ పరిశ్రమ గురించి అధ్యయనం చేశా. అందుకోసం రూ.2.5 కోట్లు వెచ్చించాలి. ఒకేసారి ఇంత పెట్టుబడా.. సాధ్యం అవుతుందా? అనే సంశయం. కుటుంబసభ్యులు, పరిశ్రమల శాఖ అధికారుల ప్రోత్సాహం లభించింది. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. 2018 జులైలో పరిశ్రమ ప్రారంభించా. మొదటి ఏడాది రూ.40 లక్షల టర్నోవర్‌ సాధించా. 2019-20లో అది రూ.కోటికి చేరింది. 18 మందికి ఉపాధి కల్పించా. త్వరలో పరిశ్రమను విస్తరిస్తా.

యువశక్తిని నిరూపించా

- కొడిమాల కుమారస్వామి మాక్స్‌ట్రా ల్యాబ్స్‌, హైదరాబాద్‌

మాది నల్గొండ. బీఎస్సీ పూర్తయ్యాక పలు ఉద్యోగాలు చేశా. ఈ క్రమంలో పరిశ్రమల్లో ఎదురయ్యే సమస్యలు చూశా. వాటిని సరిగా నిర్వర్తించడం లేదని భావించా. జీతం కోసం కాకుండా జీవితాల కోసం పని చేయాలనుకున్నా. నాకున్న అనుభవంతో సొంతంగా చెంగిచర్లలో పరిశ్రమ పెట్టాలనుకున్నా. సాధారణ విద్యార్హతతో ఏం సాధిస్తావని చాలామంది ప్రశ్నించారు. నిరూపించుకుంటానని చెప్పి, రుణాలు తీసుకుని ఔషధ పరిశ్రమను స్థాపించా. మల్టీ విటమిన్‌, ఐరన్‌, కాల్షియం, నొప్పి నివారణ, యాంటీబయాటిక్‌ మాత్రల తయారీ చేపట్టా. 56 మందికి ఉద్యోగాలు ఇచ్చా.
 

Posted Date : 26-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌