ముంబై విశ్వవిద్యాలయంతో కలిసి స్థానిక ఉన్నతవిద్య కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ ఉన్నత విద్యాసంస్థ అప్గ్రాడ్ ప్రకటించింది. తద్వారా ఈ సంస్థ తన ఉనికిని మరింత బలోపేతం చేయనుంది. ఈ నేపథ్యంలో ముంబై విశ్వవిద్యాలయం అప్గ్రాడ్ ఆధ్వర్యంలో రెండు కోర్సులను ప్రారంభించనుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పీఆర్, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సులను ఆన్లైన్ ఫార్మాట్లో అందించనుంది. కోర్సులకు సంబంధించిన ప్రోగ్రామ్ కంటెంట్ ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ముంబై విశ్వవిద్యాలయం మరాఠీలో తరగతులు నిర్వహించనుండటం ఇదే మొదటిసారి. ఈ కోర్సులకు సంబంధించిన పాఠాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుండగా.. ఉద్యోగ సమాచారం, స్వయం ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలనూ అందించనున్నారు.
వారానికి 15 గంటలు..
అభ్యాస మాడ్యుళ్లలో ప్రత్యక్ష సందేహాలను పరిష్కరించే సెషన్లు, చర్చావేదిక, కెరీర్ కోచింగ్ ఉంటుంది. అలాగే అధ్యాపకులు, సంబంధిత నిపుణులు వారానికి 15 గంటలు ఆన్లైన్లో ప్రత్యక్షంగా, రికార్డింగ్ వీడియోల రూపంలో పాఠాలు బోధించనున్నారు. అప్గ్రాడ్ సహ వ్యవసాపకుడు ఫల్గుణ్ కొంపల్లి మాట్లాడుతూ.. ‘అప్గ్రాడ్.. ముంబై విశ్వవిద్యాలయం సహకారంతో ప్రపంచ స్థాయి అభ్యాస అనుభవాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉంది. ఈ ఆన్లైన్ తరగతుల ద్వారా అభ్యాసకులకు నిపుణుల మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, ఆన్లైన్లో తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. మేము అందించే అభ్యాసాల ద్వారా మంచి ఫలితాలు రావాలన్నదే లక్ష్యం. మా సంస్థ సాఫ్ట్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెస్యూమ్ బిల్డింగ్, ఇతర కెరీర్ సలహాలను కూడా అందిస్తుంది’ అని ఆయన వివరించారు.