బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనారిటీ వర్గాలకు చెందినవారి విషయంలో పేదరికమే పెద్ద సమస్య. దీంతో ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులను ఆపేయాల్సి వస్తోంది. ఇలాంటి వారికోసమే ఉపకార వేతనాలున్నాయి. వాటిలో బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్పు ముఖ్యమైంది. దీన్ని కేంద్రప్రభుత్వం ఏటా అందిస్తోంది. తాజాగా 2020-2021 విద్యా సంవత్సరానికి ఆ ప్రకటన వెలువడింది.
మైనారిటీ వర్గాల్లోని ప్రతిభావంతులైన పేద బాలికలను ఉన్నత చదువులకు ప్రోత్సహించే లక్ష్యంతో బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్పును 2003లో ప్రారంభించారు. వారి విద్యాభివృద్ధికి ఆర్థిక స్థోమత అడ్డంకి కాకూడదనే దీన్ని ఏర్పాటు చేశారు. దిల్లీలోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇది మైనారిటీ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. స్కూలు లేదా కాలేజీ ఫీజులు చెల్లించడానికి, కోర్సుకి సంబంధించిన పుస్తకాలు లేదా స్టేషనరీ కొనుక్కోడానికి, కనీస తిండి అవసరాలను తీర్చుకోడానికి స్కాలర్షిప్పు ద్వారా అందిన మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం తరగతుల్లో ఉన్న మైనార్టీ వర్గాల విద్యార్థినులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో అకడమిక్ మెరిట్, కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఉపకారవేతనం ఎంతంటే...
తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ. అయిదు వేలు, ఇంటర్మీడియట్వారికి నెలకు రూ. ఆరువేల చొప్పున స్కాలర్షిప్పులు ఇస్తారు. డబ్బు ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల ఖాతాలో జమ అవుతుంది. స్కాలర్షిప్పు పొందినవాళ్లు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్నవారు దీనికి అనర్హులు. మొత్తం స్కాలర్షిప్పులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆయా మతాల జనాభా ప్రాతిపదికన అందిస్తారు. ఇందుకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ స్కాలర్షిప్పులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,84,864 మంది విద్యార్థినులకు రూ. 669.36 కోట్ల సాయం అందింది.
అర్హత
దేశవ్యాప్తంగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులందరూ ఈ స్కాలర్షిప్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలకు చెంది ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. ముందు తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. అంటే ఉదాహరణకు పదో తరగతి విద్యార్థిని స్కాలర్షిప్పునకు దరఖాస్తు చేసుకుంటే, ఆమె తొమ్మిదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తులు
అర్హతలున్న మైనారిటీ బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నిమిత్తం ఫీజు చెల్లించనవసరం లేదు. స్కూల్ వెరిఫికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదుచేసి ఫొటో అతికించి, దానిపై ప్రిన్సిపల్ సంతకం, స్కూల్ స్టాంప్ వేయించాలి. అనంతరం ఈ ఫారాన్ని స్కాన్చేసి అప్లికేషన్తోపాటు అప్లోడ్ చేయాలి. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నీ జతచేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ పంపాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31.
వెబ్సైట్: http://maef.nic.in