• facebook
  • whatsapp
  • telegram

డిప్లొమా, డిగ్రీ విద్యార్థినులకు ప్రత్యేకం 

* ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ స్కీం

* ఎంపికైతే ఏటా రూ.50 వేల ఆర్థిక సాయం


చదువుపై శ్రద్ధ, తెలివితేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో చాలామంది విద్యార్థినులు చదువులకు దూరమవుతున్నారు. ఉద్యోగిగా, అధికారిగా, వ్యాపారవేత్తగా, వృత్తినిపుణులురాలిగా...

బహుముఖ రంగాల్లో రాణించడానికి విద్య పాత్రే కీలకం. దీనిద్వారానే వాళ్లు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఇదంతా కార్యరూపం దాల్చడానికి చదువులో వాళ్లను ప్రోత్సహించడం తప్పనిసరి. ముఖ్యంగా సాంకేతిక విద్య దిశగా మహిళలు అడుగులేస్తే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతుంది. ఈ దిశగా వాళ్లకు ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ).. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినుల కోసం స్కాలర్‌షిప్పులు ఏర్పాటుచేసింది. ప్రగతి పేరుతో ఏటా పదివేల మందికి వీటిని అందిస్తోంది. 


ఎవరు అర్హులు?


డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం, అలాగే లేటరల్‌ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్‌ షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎన్నేసి?  

డిప్లొమా స్థాయిలో 5000 మందికి, డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో 5000 మందికి వీటిని అందిస్తారు. ఎంపికైతే ఏడాదికి రూ.యాభై వేలు చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్నవారికైతే నాలుగేళ్లు చెల్లిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్‌ అయితే మూడేళ్లపాటు ఇవి అందుతాయి.


ఎంపిక ఎలా? 

డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఉండరాదు. ఇంజినీరింగ్‌లో చేరినవారైతే ఇంటర్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని స్కాలర్‌షిప్పులు కేటాయిస్తారు.


రాష్ట్రాల వారీగా..

దేశవ్యాప్తంగా అందించే ఈ స్కాలర్‌షిప్పులకు రాష్ట్రాలవారీ కోటా విధించారు. దీని ప్రకారం ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి ఇవి దక్కుతాయి. ఏపీలో డిప్లొమా చదువుతున్న విద్యార్థినుల్లో 318 మందికి, తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయింపులు ఉంటాయి.


 ఇవీ నిబంధనలు 

ఒక కుటుంబం నుంచి ఇద్దరు బాలికలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్పులకు అర్హులు

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్‌ కోర్సులో చేరి ఉండాలి. అలాగే ప్రథమ సంవత్సరం లేదా లేటరల్‌ ఎంట్రీలో ద్వితీయ సంవత్సరంలో చేరినవాళ్లే ఈ స్కాలర్‌షిప్పులకు అర్హులు. 


దరఖాస్తులు 

వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలి. జతచేయాల్సిన సర్టిఫి కెట్లను పీడీఎఫ్‌ విధానంలో స్కాన్‌ చేసి మెయిల్‌ చేయాలి. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 31 

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/


 ఎంత మొత్తం?

ఎంపికైనవారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఏటా రూ.యాభై వేలను జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్‌...తదితర ఖర్చుల కోసం వెచ్చించుకోవచ్చు. ముందు సంవత్సరాల చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

‣ మెరుగైన భావ ప్రకటనకు మార్గాలివిగో..

‣ జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలివిగో..!

Posted Date: 11-10-2023


 

తాజా కథనాలు

మరిన్ని