• facebook
  • whatsapp
  • telegram

యూజీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

82,000 మందికి అవకాశం 
 

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారిని చదువుల్లో ప్రోత్సహించడానికి కేంద్ర ఉన్నత విద్యా విభాగం స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. వీటికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఏజీబీఎస్సీ లేదా  మరేదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 82,000 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. సీనియర్‌ సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలు అందిస్తారు. 
 

‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌’ పేరుతో అందిస్తోన్న ఈ ప్రోత్సాహకానికి ప్రస్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 82,000 స్కాలర్‌షిప్పుల్లో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు. ప్రతిభావంతులకు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి వీటిని ఏర్పాటుచేశారు. యూజీ నుంచి పీజీ వరకు అయిదేళ్లపాటు ఈ పురస్కారాలు అందుతాయి. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున మొదటి మూడేళ్లు చెల్లిస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు. 
 

అర్హత: 2019-2020 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు. ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అంటే ఆ బోర్డు పరిధిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. రెగ్యులర్‌ విధానంలో చదివినవారే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించినవాళ్లు అనర్హులు. స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవారు తర్వాత సంవత్సరాల్లోనూ స్కాలర్‌షిప్పు పొందడానికి అంతకు ముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి. 
 

రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.
 

దరఖాస్తులు: విద్యార్థులు ముందుగా నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో తమ వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్పు పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూరించాలి. అవసరమైన పత్రాలను జతచేయాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:  అక్టోబరు 31
 

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌పై క్లిక్‌ చేసి ఈ స్కాలర్‌షిప్పునకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు.
 

తెలుగు రాష్ట్రాలకు ఇలా...
ఈ స్కాలర్‌షిప్పును రాష్ట్రాలవారీగా విభజించారు. ఇందుకు ఆయా రాష్ట్రాలవారీ 18-25 ఏళ్ల వయసు జనాభానూ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ విధానంలో ప్లస్‌ 2 చదివినవారికి 5413, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు 577 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు ద్వారా చదువుకున్న విద్యార్థులకు 3527, తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు 2570 స్కాలర్‌షిప్పులు కేటాయించారు. రాష్ట్రాలవారీ కేటాయించిన స్కాలర్‌షిప్పుల్లో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్‌ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు.

Posted Date: 24-11-2020


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం