‣ పీజీ ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్
మీరు బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీ కోసమే ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్లు సిద్ధంగా ఉన్నాయి. వీటికి ఎంపికైనవారికి పీజీలో ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. అర్హత, ఆసక్తి ఉంటేనవంబరు 30లోగా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోత్సాహం అందుకున్నవారు ఇతర స్కాలర్షిప్లకూ అర్హులే.
ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఉన్నత చదువుల్లో చేరేవారి వాటాలో మహిళలు తక్కువగా ఉన్నారు. తల్లిదండ్రుల దృక్పథం, సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం.. తదితర కారణాలతో చాలా మంది విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎన్నో కుటుంబాలు మహిళలను అభివృద్ధిలో భాగంగా గుర్తించలేకపోతున్నాయి. పెళ్లీడుకి రాగానే వివాహం జరిపించి, బాధ్యతలను తీర్చుకుందామనుకునేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో పీజీలో చేరే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం రూపొందించిందే ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్’. దీనిద్వారా విద్యార్థినులకు ఆర్థికంగా అండగా నిలిచి, చదువులో ప్రోత్సహించి, పీజీ చదివే మహిళల సంఖ్య పెరిగేలా చూడాలన్నది యూజీసీ లక్ష్యం.
‣ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం...కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారికి అవకాశం ఉండదు.
‣ దూరవిద్యలో పీజీ కోర్సులు చదువుతున్నవారు స్కాలర్షిప్కు అనర్హులు.
ఏ అర్హతలుండాలి?
తల్లిదండ్రులకు ఒక్క కుమార్తే సంతానం అయి ఉండాలి. అలాగే మొదటి సంతానంలో ఇద్దరూ కవలలు అది కూడా అమ్మాయిలే అయితే వారిద్దరికీ ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే స్కాలర్షిప్ వర్తించదు. ఈ విద్యా సంవత్సరంలో పీజీ ప్రథమ సంవత్సరంలో చేరినవారే దీనికి అర్హులు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు మించరాదు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం...కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివినవాళ్లకు అవకాశం ఉండదు. అలాగే దూరవిద్యలో పీజీ కోర్సులు చదువుతున్నవాళ్లు కూడా స్కాలర్షిప్కు అనర్హులు. ఈ స్కాలర్షిప్ పొందిన విద్యార్థినులు ఇతర ప్రోత్సాహకాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైతే ...
ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. ఈ డబ్బులు నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతాయి. వీటిని ఫీజు, వసతి, పుస్తకాలు..నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.
పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్టు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. దీని ఫార్మాట్ కూడా వెబ్సైట్లో లభిస్తుంది. దానిపై వివరాలు పూరించాలి. సంబంధిత యూనివర్సిటీ/కాలేజీ ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి. అలాగే తల్లిదండ్రులకు ఏకైక సంతానమని నిర్ధారిస్తూ అధికారుల ధ్రువీకరణ అఫిడవిట్నూ పొందుపరచాలి. ఈ పత్రాలను దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
వెబ్సైట్: https://scholarships.gov.in/