• facebook
  • whatsapp
  • telegram

సాంకేతిక విద్యార్థినులకు ఉపకారం

10,000 ప్రగతి స్కాలర్‌షిప్‌లు 
 

తెలివితేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సరైన ఆసరా లేక చాలామంది బాలికలు చదువులకు దూరమవుతున్నారు. భవిష్యత్తులో వీరు ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా...ఇలా బహుముఖ రంగాల్లో రాణించడానికి విద్య ఎంతో అవసరం. దీనిద్వారానే వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఇదంతా జరగాలంటే చదువులో వాళ్లను ప్రోత్సహించడం తప్పనిసరి. ముఖ్యంగా సాంకేతిక విద్య దిశగా మహిళలు అడుగులేస్తే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతుంది. అందుకే వారికి ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదువుతున్న అమ్మాయిల కోసం స్కాలర్‌షిప్‌లు ఏర్పాటుచేసింది. ప్రగతి పేరుతో ఏటా పదివేల మందికి వీటిని అందిస్తోంది. 
 

డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం, అలాగే లేటరల్‌ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా స్థాయిలో 5000 మందికీ, డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో 5000 మందికీ వీటిని అందిస్తారు. వీటికి ఎంపికైతే ఏడాదికి రూ.యాభై వేల చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్నవారికైతే నాలుగేళ్లు చెల్లిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్‌ అయితే మూడేళ్లపాటు ఇవి అందుతాయి. 
 

దేశవ్యాప్తంగా అందించే ఈ స్కాలర్‌షిప్‌లకు రాష్ట్రాలవారీ కోటా విధించారు. దీని ప్రకారం ఏపీలో డిప్లొమా చదువుతున్న విద్యార్థినుల్లో 318 మందికి, తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి ఇవి దక్కుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయింపులు ఉంటాయి. ఎంపికైనవారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఏటా రూ.యాభై వేలను జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్‌...తదితర ఖర్చుల కోసం వెచ్చించుకోవచ్చు. ముందు సంవత్సరాల చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు. 
 

ఎంపిక విధానం
డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఉండరాదు. ఇంజినీరింగ్‌లో చేరినవారైతే ఇంటర్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.
 

అర్హతలు
ఒక కుటుంబం నుంచి ఇద్దరు బాలికలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ జతచేయాలి.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్‌ కోర్సులో చేరి ఉండాలి.
సంబంధిత కోర్సులో ప్రథమ సంవత్సరం లేదా లేటరల్‌ ఎంట్రీలో ద్వితీయ సంవత్సరంలో చేరినవాళ్లే ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులు. 
 

దరఖాస్తులు
వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలి. జతచేయాల్సిన సర్టిఫికెట్లను పీడీఎఫ్‌ విధానంలో స్కాన్‌చేసి మెయిల్‌ చేయాలి. 
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:  డిసెంబరు 30
వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
 

Posted Date: 30-11-2020


 

తాజా కథనాలు

మరిన్ని