• facebook
  • whatsapp
  • telegram

పేద విద్యార్థులకు బీమా సంస్థ భరోసా

ప్రతి డివిజినల్ సెంటర్‌కు 20 ఎల్ఐసీ స్కాలర్ షిప్‌లు

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులను ఆదుకోడానికి భారత జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఎల్ఐసీ) ఏటా ఉపకారవేతనాలను అందిస్తోంది. పేదరికంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా మెరుగైన అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సాయపడుతోంది. ప్రస్తుతం 2020-21 సంవత్సరానికి ‘గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్-2020’ పేరుతో ప్రకటన విడుదలైంది.

పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉంటే చాలు. ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌న‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో చేరిన వారికీ ఈ సాయం అందుతుంది. 

ఎవరు అర్హులు?

పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యను 2019-20 సంవత్సరానికి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిష్‌న‌కు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదివి 60 శాతం మార్కులు పొంది ఉండాలి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఏదైనా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష మించకూడదు.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులు 2019-20 సంవత్సరానికి పదోతరగతి 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా 10+2 లో చేరాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేషన్ విద్యకు మాత్రమే ఈ ఉపకారవేతనాలను అందిస్తారు.  పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యకు ఇవ్వరు.

ఎంపిక ఎలా?

కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు.

ఎలాంటి ప్రయోజనాలు?

దేశవ్యాప్తంగా ఒక్కో ఎల్ఐసీ డివిజనల్ సెంటర్‌కు 20 (బాలురు -10, బాలికలు -10) చొప్పున స్కాలర్ షిప్‌లను అందిస్తుంది. ఎంపికైన విద్యార్థికి ఏటా రూ. 20,000 లను మూడు విడతలుగా చెల్లిస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు ఇస్తారు. ఈ మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు పంపుతారు. ఇలా కోర్సు పూర్తయ్యే వరకు ఇస్తారు.

మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు 55 శాతం మార్కులను, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు 50 శాతం మార్కులను పొందితేనే మరుసటి సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 31, 2020. 

వెబ్ సైట్: https://www.licindia.in/
 

Posted Date: 01-12-2020


 

తాజా కథనాలు

మరిన్ని