‣ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయన్న మాట వాస్తవం. ఫీజులు కట్టలేక చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపడం లేదు. అలాంటి ఎంతోమంది విద్యార్థుల ఉన్నత చదువులకు పలు సంస్థలు స్కాలర్షిప్లు అందించి అండగా నిలుస్తున్నాయి. వాటిలో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్) ఒకటి. డాక్టోరల్ స్టడీస్ (పీహెచ్డీ) చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేందుకు ఈ సంస్థ ప్రకటన విడదల చేసింది. వీటిని మనదేశంతోపాటు ఆసియాలోని ఇతర దేశాల విద్యార్థులకు కూడా అందించనుంది.
ఇదీ అర్హత
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో డాక్టోరల్ స్టడీస్ (పీహెచ్డీ) చేసే విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పీహెచ్డీలో ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపారేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రీఫీ, పిలాసఫీ, ఎకాలజీ & ఎన్విరాన్మెంటల్ విభాగాల్లో చదివేందుకు ఇప్పటికే విశ్వవిద్యాలయం/ఇన్స్టిట్యూట్లో చేరి ఉండాలి. కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఫుల్ టైం పీహెచ్డీ స్కాలర్లకు మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. వయసు 35 ఏళ్లకు మించకూడదు.
ఎంత ఇస్తారు?
ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లపాటు స్కాలర్షిప్ అందుతుంది. ఇందులో మెయింటెనెన్స్ అలవెన్స్, ట్యూషన్ ఫీజుతో కలిసి నెలకు రూ.18 వేలు, దేశంలోని స్టడీ టూర్లకు, పుస్తకాల కొనుగోలు, స్టేషనరీ తదితర ఖర్చులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు.
దరఖాస్తు ఎలా?
అర్హులైన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ లకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సూచించిన విధంగా నింపిన దరఖాస్తు ఫారాలను 31 మే 2021 లోపు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, తీన్ మూర్తి హౌజ్, న్యూదిల్లీ-110011 చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం
ఇంటర్వ్యూల ఆధారంగా స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించిన అనంతరం ఎంపిక కమిటీ ఆయా అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తుంది. దాని ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
వెబ్ సైట్: https://www.jnmf.in/index.html