దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఓఎన్జీసీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్షిప్పులు అందిస్తోంది. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువడింది.
ఓఎన్జీసీ ఏటా అందించే 2000 స్కాలర్షిప్పుల్లో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంతవరకు ఈ ప్రోత్సాహం కొనసాగుతుంది.
ఎవరికోసం: భారత్లో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2020-2021 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.
వయసు: జనవరి 1, 2020 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్షిప్పులు మంజూరు చేస్తారు.
స్కాలర్షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
కోర్సులు, కేటగిరీలవారీ...
ఇంజినీరింగ్: 494 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్
ఎంబీబీఎస్: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
ఎంబీఏ: 146 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
జియాలజీ/ జియోఫిజిక్స్: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్.
దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి.
వేరే ఏ స్కాలర్షిప్పులూ మంజూరు కానివాళ్లే ఓఎన్జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందేవాళ్లు ఈ స్కాలర్షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కొనసాగాలంటే: స్కాలర్షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్పు అందదు.
దరఖాస్తు: ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదుచేయాలి. కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల పత్రం, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది.
చివరి తేది: ఆగస్టు 6 https://ongcscholar.org/