* రోజుకు పది గంటల కష్టం
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది ఆరు కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మూడేళ్లలో సాధించడమంటే మాటలా? ప్రణాళికంటూ ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరానికి చెందిన 24 ఏళ్ల అంబటి కీర్తినాయుడు.. 2019లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సచివాలయ కార్యదర్శి ఉద్యోగం మొదలు.. తాజాగా జీఎస్టీ ఇన్స్పెక్టర్ వరకు మొత్తం ఏడు ఉద్యోగాలు సాధించారీమె. ‘నాన్న మురళీకృష్ణ అడ్వకేట్. అమ్మ విజయలక్ష్మి. నా చదువంతా రాజమహేంద్రవరంలోనే సాగింది. డిగ్రీలో బీబీఏలో చేరా. మా పక్కింటమ్మాయి నాగసత్య వరలక్ష్మి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదివి, ఇప్పుడు ఎండీ చేస్తోంది. తనే నాకు స్ఫూర్తి. తన దగ్గరే చదివినవి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకున్నా. డిగ్రీ తరువాత ఉద్యోగావకాశాలు పెద్దగా ఉండవని తెలుసు. అందుకే డిగ్రీలో చేరిననాటి నుంచే ప్రభుత్వ కొలువు కోసం చదివా. డిగ్రీ పూర్తయ్యాక రోజుకు పది గంటలు కష్టపడేదాన్ని. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ కొలువు వచ్చినా వద్దని, ఆదాయపు పన్నుశాఖలో ట్యాక్స్ అసిస్టెంట్ కొలువులో చేరా. ఆ ఉద్యోగం చేస్తూనే, ఇతర ఉద్యోగాలకూ శిక్షణ తీసుకున్నా. స్టాఫ్సెలక్షన్ కమిషన్ రాసి ఎంటీఎస్ ఉద్యోగం, రైల్వేలో ట్రైన్స్ క్లర్క్గా, 2022లో సీహెచ్ఎస్ఏలో.. పోస్టల్ అసిస్టెంట్గా, అదే ఏడాది జీఎస్టీ ట్యాక్స్ అసిస్టెంట్ కొలువులు వచ్చినా వెళ్లలేదు. తాజాగా జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా సివిల్స్ సాధించాలని ఉంది. ఇవి కాక డిగ్రీ పూర్తవ్వగానే ఆరు ప్రైవేటు కొలువులు వచ్చాయి. టీసీఎస్లో కొన్నిరోజులు పనిచేసి వదిలేశా. ఎంతమంది నిరుత్సాహ పరిచినా మనం నమ్మిన దాని కోసం గట్టిగా నిలబడి, సాధన చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. అందుకు నేనే ఉదాహరణ’.. అంటోంది కీర్తి.
- భేరి అశోక్కుమార్, రాజమహేంద్రవరం
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు