‣ లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి
ముఖ్యాంశాలు :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జులై 23న బడ్జెట్ సమర్పించనున్న వేళ జులై 22న ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు.
‣ బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు :
‣ 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికం 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చు.
‣ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు ఆర్థికానికి అండగా నిలిచాయి.
‣ దేశంలో ఆర్థిక వ్యవస్థ మున్ముందు వృద్ధిలో ముందుకు దూసుకెళ్లనుంది.
‣ అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు.
‣ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
‣ కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.
‣ భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.
‣ పెరిగిన చైనా ఎఫ్డీఐలు ప్రపంచంలో భారత సప్లయ్ చైన్లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుంది.
‣ దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది.
‣ ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో రూ.14వేల కోట్లు కార్యరూపం దాల్చాయి.