• facebook
  • whatsapp
  • telegram

  ఆర్థిక రంగానికి పుటమేసే బంగారం

* బంగారం కొనుగోళ్లతో మాంద్యానికి మందు
* డిజిటల్‌ లావాదేవీలే ఆయువుపట్టు
* మదుపుదారుల తీరు మారాలి
* విదేశ మారక ద్రవ్యం ఆదాకు మార్గం

బంగారం అనగానే భారతీయులకు తమ హోదా, సంపద ప్రదర్శించేందుకు అనువైన ఆభరణాలు గుర్తుకు వస్తాయి. అదే పాశ్చాత్య దేశీయులు మాత్రం సంపాదనకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా పసిడిని పరిగణిస్తారు. దేశీయంగా చోరీల భయంతో అనేకమంది బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లు, ఇనుప బీరువాల్లోనే దాచిపెడుతుంటారు. అందువల్లే దేశంలో ప్రజలు, సంస్థల వద్ద 25 వేల టన్నులకుపైగా సువర్ణం పోగుపడినా ప్రయోజనం ఉండటంలేదు. ఏటా 800 టన్నులకు పైగా పసిడిని అధికారికంగా కొనుగోలు చేసేందుకు విదేశ మారక ద్రవ్యాన్ని పెద్దయెత్తున వినియోగించాల్సి వస్తోంది. దేశ ప్రస్తుత ఖాతా లోటు (సీఏడీ) అధికం కావడానికి, రూపాయి మారక విలువ క్షీణతకు బంగారం కారణమవుతోందన్నది ప్రభుత్వ వాదన. బంగారాన్ని విలువైన ‘వాణిజ్య’ (ట్రేడింగ్‌) లోహంగా మాత్రమే పరిగణిస్తున్న కొన్ని దేశాలవారు మాత్రం తమ సంపదను అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రపంచంలో బంగారాన్ని లోహరూపంలో అధికంగా కొనుగోలు చేసేది చైనా, భారత్‌లే. ఈ రెండు దేశాల ప్రజలు ఆభరణాలను ఇష్టపడతారు. మిగిలిన దేశాల్లో కేంద్రీయ బ్యాంకులు మాత్రమే లోహరూపంలో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాయి. ప్రజలు మాత్రం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడిగానే బంగారాన్ని చూస్తుంటారు. చైనాలో కొంతవరకు బంగారాన్ని గనుల నుంచి తవ్వితీస్తున్నారు. మన దేశం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విదేశ మారక ద్రవ్యంగా భావించే అమెరికా డాలరుకు గిరాకీ పెరిగితే, బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నప్పుడు దాదాపు అన్ని దేశాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని గుర్తిస్తారు. అప్పుడు డాలర్‌ విలువ కాస్త తగ్గుతుంది. కానీ అంతర్జాతీయ విపణిలో బంగారం/డాలర్‌ విలువ ఒకటి పెరిగి మరొకటి తగ్గినా, దిగుమతులపైనే ఆధారపడినందువల్ల మన దేశంలో మాత్రం ధరల్లో తేడా రావడం లేదు. డాలర్‌, బంగారం విలువలు రెండూ తగ్గితేనే మనకు ఊరట.

స్వర్ణం ధర భారత్‌లోనే అధికం
ఏ వస్తువు ధరనైనా ఉత్పత్తి వ్యయంతోపాటు సరఫరా, గిరాకీలూ ప్రభావితం చేస్తాయి. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు అంతర్జాతీయంగా గిరాకీ అధికమై, బంగారం ధర పెరుగుతుంటుంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్‌ డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు సురక్షితం కాదనే కొందరు మదుపరులు/పెట్టుబడిదారులు భావిస్తుంటారు. 2008-09 నాటి సంక్షోభ సమయంలోనూ అంతర్జాతీయంగా పసిడి ధరలు బాగా దిగివచ్చాయి. రుణ సంక్షోభం తీవ్రమైనప్పుడు, ‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌’లో రుణంపై కొనుగోలు చేసిన పసిడి పెట్టుబడులను తప్పనిసరిగా విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడటమే ఇందుకు కారణం. కానీ డాలర్‌ విలువ పెరగడంతో దేశీయంగా బంగారం ధర పైకెగబాకింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేస్తే ప్రతిఫలం బాగుంటుంది. అందువల్లే భారత్‌లోనూ పసిడిపై పెట్టుబడులు పెట్టే ధోరణి మధ్యతరగతి వర్గంలో క్రమంగా పుంజుకొంటోంది. వీరు ట్రేడింగ్‌లో కాకుండా, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారం కొనుగోలు చేస్తున్నందువల్ల దేశానికి దిగుమతుల బిల్లు అధికమవుతోంది. ఆడపిల్లలున్న కుటుంబాలు మాత్రం భవిష్యత్తులో ధర పెరుగుతుందన్న భావనతో, వీలైన సమయంలో మేలిమి బంగారాన్ని కొని దాచుకొంటున్నారు. దేశీయంగా 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర ఎన్నడూ లేనంత గరిష్ఠస్థాయి చేరి, రూ.41,000-42,000 స్థాయిలో కదలాడుతోంది. పదేళ్లలో బంగారం ధర రెట్టింపైంది. అంతర్జాతీయంగా మాత్రం ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 2011 నాటి గరిష్ఠధర 1,879 డాలర్లకు ఆమడదూరాన 1,570 డాలర్ల వద్దే ఉంది. అంతర్జాతీయంగా ధర తక్కువగానే ఉన్నా, దేశీయంగా ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరేందుకు డాలర్‌ మారకపు విలువతో పాటు, దేశీయంగా విధిస్తున్న దిగుమతి సుంకం, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కలిపి 15.5 శాతం అదనంగా కలవడమే కారణమవుతున్నాయి. అంతర్జాతీయ విపణి కంటే గ్రాముకు రూ.500కు పైగా పన్నురూపంలోనే మనం చెల్లిస్తున్నాం. అంటే కిలోకు అయిదు లక్షల రూపాయల తేడా ఉంటోంది. ఇదే అంశం బంగారాన్ని చాటుగా తెచ్చేవారికి (స్మగ్లర్లకు) భారీ అవకాశాలు తెస్తోంది. నిత్యం ఏదో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలోలకొద్దీ బంగారాన్ని పట్టుకుంటున్నా, అంతకు కొన్నిరెట్లు దొంగచాటుగా అక్రమార్కులకు చేరుతోంది. నౌకాశ్రయాల ద్వారా గత కొన్నేళ్లలో నాలుగు టన్నుల పసిడిని దొంగచాటుగా తెచ్చిన కేరళ వ్యక్తిని అధికారులు ఈ నెలలోనే పట్టుకున్నారు. స్మగ్లింగ్‌ నిరోధానికి పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని ఆరు శాతానికి తగ్గించాలన్న ఆభరణాల విక్రేతల విన్నపాన్ని 2020-21 బడ్జెట్‌లోనూ విత్తమంత్రి పట్టించుకోలేదు. దొంగచాటుగా తెచ్చి, తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ అమాయకులు/ఆశపరులను మభ్యపెట్టి, నకిలీ బంగారం అంటగట్టే కేసులూ అధికమవుతున్నాయి. స్మగ్లింగ్‌ నిరోధంతో పాటు ఇలాంటి కేసులపై కఠినంగా వ్యవహరిస్తేనే మేలు.


బంగారపు గనులు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా, ఘనా, రష్యా వంటి దేశాల్లో కార్మికులు అధిక వేతనాలు డిమాండ్‌ చేస్తుండటంతో బంగారం వెలికితీత వ్యయం అధికమవుతోంది. ఆసియా సహా ఇతర దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడికి గిరాకీ పుంజుకొంది. దీనివల్ల బంగారం ధర క్రమేణా పెరుగుతోందని చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరహాలో పసిడి కొనుగోళ్లు, నిల్వ విషయంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ప్రజల ధోరణిలో మార్పు రాదు. కాకపోతే ప్రజలు చెల్లిస్తున్న డబ్బుకు తగిన స్వచ్ఛమైన పసిడి వస్తుందా, ఆభరణాల్లో ఉంటోందా అంటే సందేహమే. బీఐఎస్‌ (భారతీయ ప్రమాణాల మండలి) నిబంధనల మేరకు ఆభరణాల్లో పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ‘హాల్‌ మార్కింగ్‌’ ముద్రణ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉంది. గొలుసుకట్టు పద్ధతిలో విక్రయశాలలు నిర్వహిస్తున్న సంఘటిత సంస్థల్లోనే ‘హాల్‌ మార్కింగ్‌’ ఆభరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇతర వ్యాపారుల వద్ద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆభరణాలు తక్కువ. దేశీయ వార్షిక విపణిలో 40 శాతం ఆభరణాలు మాత్రమే ‘హాల్‌ మార్కింగ్‌’వని కేంద్రమంత్రే ఇటీవల ప్రకటించారు. వినియోగదారులు నష్టపోకుండా 2021 జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా ‘హాల్‌మార్కింగ్‌’ ఆభరణాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనను ఈ నెల 16న ‘నోటిఫై’ చేశారు. వచ్చే ఏడాది నుంచి 14, 18, 22 క్యారెట్ల ఆభరణాలే విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి నగపై తప్పనిసరిగా బీఐఎస్‌ చిహ్నం, ఎన్ని క్యారెట్లు, అది ఎంత స్వచ్ఛతకు చిహ్నం అనే సంఖ్యలు, ‘హాల్‌మార్క్‌’ గుర్తింపునిచ్చిన కేంద్రం ముద్ర, నగ గుర్తింపు సంఖ్యను ముద్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని 234 జిల్లాల్లో బీఐఎస్‌ (భారతీయ ప్రమాణాల మండలి) హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు 892 ఉన్నాయి. 29 వేలమంది నగల వ్యాపారులు బీఎస్‌ఐ వద్ద నమోదై ఉన్నారు. మరో నాలుగు లక్షల మంది నమోదు కావాల్సి ఉంది. ఏడాదిలోగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రైవేటు భాగస్వామ్యంలో ‘హాల్‌ మార్కింగ్‌’ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇప్పటికే తయారుచేసిన, చేస్తున్న ‘హాల్‌ మార్కింగ్‌’ లేని ఆభరణాలను వచ్చే జనవరిలోగా విక్రయించుకోవాలి. ఇదే నిబంధన వెండి వస్తువులకూ వర్తింపజేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. ట్రేడింగ్‌ విపణిలో చూపే కిలో వెండి ధరనే ప్రామాణికంగా చెబుతూ వెండి వస్తువులను దుకాణాల్లో విక్రయిస్తున్నారు. వాస్తవానికి ట్రేడింగ్‌ విపణిలో చూపేది 999 స్వచ్ఛత గల వెండి. కానీ అత్యధికులు 90-60 శాతం నాణ్యతతో రూపొందించే వెండి వస్తువులకూ ప్రజల నుంచి గరిష్ఠ ధర వసూలు చేస్తున్నారు. వజ్రాల విషయానికొస్తే, ప్రస్తుతం గనుల్లో తవ్వితీసిన వజ్రాల నాణ్యతను బట్టి క్యారెట్‌ ధర మూడు నుంచి పది లక్షల రూపాయల వరకు ఉంటోంది. పసిడి తరహాలో స్థానికంగా వీటి నాణ్యతను పరీక్షించే అవకాశం లేదు. దుకాణంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని నమ్మాల్సిందే. సహజ వజ్రాల వెలికితీతకు సగటున క్యారెట్‌కు 1,750 మెట్రిక్‌ టన్నుల మట్టిని తవ్వాల్సి వస్తోంది. నీటి వాడకమూ అధికమే. అందుకే అధిక ఉష్ణోగ్రతల వద్ద సీవీడీ వజ్రాలు తయారు చేస్తున్నారు. సహజ వజ్రాల తరహాలోనే ఉండే వీటి ధర క్యారెట్‌కు లక్ష రూపాయల వరకు ఉంటుంది. తిరిగి కొనుగోలుకు 80 శాతం విలువ లభిస్తుంది. పాశ్చాత్యుల తరహాలో వజ్రాభరణాలు ధరించాలనుకునే మధ్యతరగతివారికి ఇవి అనువుగా ఉంటాయి.

పెట్టుబడులకు మేలిమి ప్రత్యామ్నాయం
దేశీయ ధరల ప్రకారం చూస్తే 1980 నుంచి పసిడి ధరలో వృద్ధి అధికమైంది. ప్రతి పదేళ్లకు రెట్టింపుకన్నా మించి పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం విలువ 2030నాటికి రూ.80,000 చేరవచ్చనేది విక్రయసంస్థల అంచనా. సామాన్య మదుపరుల దృక్పథంతో ఆలోచిస్తే, పదేళ్లకు రెట్టింపు ప్రతిఫలం బంగారంపై లభిస్తోంది. అవసరమైన మేరకు ఆభరణాలు మాత్రం కొనుగోలు చేస్తూ, పెట్టుబడిగా బిస్కెట్లు కొందామనుకునేవారికి డిజిటల్‌ మార్గాల్లో పెట్టుబడులు మేలు. భారత ప్రభుత్వం విక్రయిస్తున్న సార్వభౌమ పసిడి బాండ్లు, పసిడి ఈటీఎఫ్‌లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ట్రేడింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కమొడిటీస్‌ విపణిలో ప్రధానమైన ఎమ్‌సీఎక్స్‌ ఎక్స్ఛేంజీలో నమోదు కావచ్చు. అవసరమైతే భౌతికరూపంలో బంగారాన్ని తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం 38 లక్షల మంది ఈ ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దేశీయ ఈక్విటీ విపణికి కీలకమైన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదైన మదుపరుల సంఖ్య 2019లోనే 30 లక్షలు పెరిగి, ఈ ఏడాది జనవరికి మూడు కోట్లు దాటింది. ఇందులో 13 శాతమే కమొడిటీస్‌ విపణిలో ఉన్నారు. 2010-19 మధ్య చూస్తే బంగారం ధర 134 శాతం, వెండి ధర 75 శాతం, బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 130 శాతం పెరిగాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే మంచిది. తద్వారా దేశానికి విదేశ మారక ద్రవ్యం ఆదా చేసినట్లు అవుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రజలు భాగస్వాములుగా మారడంతో పాటు, వ్యక్తిగతంగానూ లాభపడతారు!

- కాకుమాను అమర్‌కుమార్‌

Posted Date: 21-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం