• facebook
  • whatsapp
  • telegram

పునరుత్తేజానికి బహుముఖ వ్యూహం

* సడలని సంకల్పమే దేశానికి రక్ష

     ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం ఎంత ముఖ్యమో, ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడికి సాయం చేయడమూ అంతే కీలకం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రాణాంతక మహమ్మారిపై పోరాటం సుదీర్ఘంగా సాగే పరిస్థితే కనిపిస్తోంది. ముగింపు దరిదాపుల్లో గోచరించడంలేదు. తబ్లిగీ జమాత్‌ ఉదంతం బయటపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య, పోలీసు సేవలు మరింత అవసరమయ్యాయి. త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశిద్దాం. ఇప్పటికైతే, మన జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భావించవచ్చు. అభివృద్ధి చెందిన, సమున్నతమైన ఆరోగ్య వ్యవస్థల్ని కలిగి ఉన్న దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాధి తలసరి సంక్రమణ రేటు తక్కువగానే ఉంది. మహమ్మారిపై పోరాటం ముగిస్తే, ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాల్ని ప్రారంభించే విషయంలో అధికారులు త్వరలోనే పునరాలోచన చేయాల్సి ఉంది. మూసివేత కారణంగా ఇప్పటికే భారీ ఆర్థిక నష్టం సంభవించింది. కొన్ని అంచనాల ప్రకారం ఇది జీడీపీలో నాలుగు శాతం దాకా నష్టానికి దారితీసి ఉంటుంది. ఈ విషయంలో నిర్దిష్టమైన అంకెలు అందుబాటులోకి రాకున్నా, ప్రపంచంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రస్థాయి మాంద్యాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా వృద్ధి నాలుగు శాతం, అంతకన్నా తక్కువగానే ఉండొచ్చు.
భారత్‌లో ఆశాజనకం
     ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి అంత సానుకూలంగా ఏమీలేదు. ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకునేందుకు కనీసం రెండు త్రైమాసికాలైనా పట్టొచ్చు. పునరుత్తేజానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలనే విషయంలో భిన్నరకాల చర్చలు సాగుతున్నాయి. ఆంగ్లంలో ‘వి’ అక్షరంలా ఉండాలా (అంటే... ఒక్కసారిగా పతనం, అంతేవేగంగా ఊర్ధ్వముఖంగా లేవడం), ‘డబ్ల్యూ’లా ఉండాలా (అకస్మాత్తుగా పతనం, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ముందు ఒక మోస్తరుగా కోలుకోవడం), ‘ఎల్‌’ ఆకృతిలోనా (వేగంగా పతనమై, కనిష్ఠ స్థాయుల్లో అక్కడే స్థిరపడిపోవడం) అనేది తాజా చర్చ. ఈ పద్ధతుల్లో దేన్ని అనుసరించాలనే విషయం తేలాల్సిఉంది. వీటిలో ఏది జరుగుతుందనేది కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఆర్థిక శాస్త్రం అసంపూర్ణమైనది, విభిన్నరకాల పరిస్థితులపై ఆధారపడుతుంది. వాస్తవానికి మాంద్యం తర్వాత కోలుకునే ప్రక్రియ- చాలాకాలంపాటు బలహీనంగా ఉండిపోతుందని కొంతమంది ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. వాస్తవ సంఖ్యలు ఏవైనాగానీ, చైనా, అమెరికా సహా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా వేగంగా వృద్ధి చెందుతుందని అధికారిక అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితులన్నీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక కరోనా వైరస్‌ ప్యాకేజీని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లక్షల కొద్దీ ఉన్న రోజువారీ కూలీలు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల ఇక్కట్లు తొలగించడానికి ఇలాంటి చర్యలు ఎంతైనా అవసరం.


జీవనోపాధికే ప్రాధాన్యం
     ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనవసరమైన భారం పడకుండా పేదలు, బాధితులకు మరింత సహాయం ఎలా చేయాలనే విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్యాకేజీలో భాగంగా కేంద్రం ఇప్పటికే ప్రకటించిన రూ.1.76 లక్షల కోట్లకన్నా కనీసం మూడురెట్లు ఎక్కువగా సహాయం ప్రకటించాలని, కొన్ని నిబంధనలను సడలించాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ ప్యాకేజీని అనేక రెట్లు పెంచితే- అది భరించలేని ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని, ఇటీవలి రోజుల్లో ఇప్పటికే చాలా విలువను కోల్పోయిన కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి మార్చిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సుమారు రూ.1.20లక్షల కోట్లు ఉపసంహరించారు. దీనివల్ల సెన్సెక్స్‌ 53 శాతానికిపైగా పడిపోయింది. ఇది భారీ నష్టాలను మిగిల్చింది. మార్చిలో దేశీయ సంస్థలు రూ.55వేల కోట్లకుపైగా షేర్లను కొనుగోలు చేసినా, సూచీల పతనాన్ని అడ్డుకోవంలో విఫలమయ్యాయి. అందుకని, రెండు విభిన్న ధోరణుల నడుమ మధ్యేమార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
     మిగతా విషయాలన్నింటికంటే ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యం కల్పించాలి. అదేసమయంలో, కేంద్ర, రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే పేదలతోపాటు, సంపన్నులూ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బలమైన వృద్ధి నుంచి పేదలు విభిన్న మార్గాల్లో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక సరళీకరణ చర్యల అనంతరం కాలంలో అనేకమంది పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడిన సంగతి మరవకూడదు. ప్రస్తుతానికి వస్తే- 21 రోజుల జాతీయ లాక్‌డౌన్‌ ముగిసేనాటికి ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు సాధ్యమైనంతవరకు కార్యకలాపాలు ప్రారంభించేలా కృషి చేయాలి. ప్రస్తుతం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ఎలాంటి పరిస్థితుల్లోనూ బలహీనపడకుండా చూసుకోవాలి. సుదీర్ఘకాలంపాటు ఆర్థిక వ్యవస్థను మూసి ఉంచడాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఎంతమాత్రం భరించలేదన్న సంగతి అందరూ గుర్తించాలి.

- వీరేంద్ర‌క‌పూర్‌

Posted Date: 24-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం