• facebook
  • whatsapp
  • telegram

  పరిశోధనల దన్ను లేక ప్రగతి మందగమనం

ప్రజల నిత్య జీవితంలో విజ్ఞానశాస్త్ర ప్రభావం, దాని ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించేందుకు విజ్ఞానశాస్త్ర దినోత్సవం దోహదపడుతోంది. భారత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్‌ సి.వి.రామన్‌- ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీని ఏటా ‘జాతీయ సైన్స్‌ దినం’గా జరుపుకొంటున్నాం. 1928 ఫిబ్రవరి 28న ఆ ఘనతను సాధించగా, 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం దక్కింది. 1987లో తొలి జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం నిర్వహించారు. 1954లో రామన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించారు. సైన్స్‌ దినోత్సవంలో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు పలురకాల విజ్ఞానశాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించడం, సాంకేతిక అంశాలపై సదస్సుల్లో పాల్గొనడం, ప్రాజెక్టులు, పరిశోధనల ప్రదర్శన, చర్చలు, క్విజ్‌ పోటీలు, ఉపన్యాసాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు తదితర కార్యక్రమాలెన్నింటినో నిర్వహిస్తారు. వీటన్నింటి వెనక ముఖ్య ఉద్దేశం- బడిపిల్లల్లో శాస్త్ర పరిశోధనకు సంబంధించి ఆలోచనలు రేకెత్తించడమే. 2020 ‘జాతీయ సైన్స్‌ దినం’ ప్రత్యేకాంశంగా ‘విజ్ఞానశాస్త్రంలో మహిళలు’ అనే అంశాన్ని నిర్ణయించారు. విజ్ఞానశాస్త్ర పరిశోధన సుదీర్ఘ ప్రక్రియ. ఏ దేశానికైనా దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఇదే. శాస్త్ర పరిశోధనలో సాధించే విజయాలే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా కీలక ఆధారంగా నిలుస్తాయి. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు అభివృద్ధికి కీలకం. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఉన్నతికి, పురోగతికి ప్రధానం. శాస్త్ర పరిశోధన- సమాజ పురోగతికి పునాది వేయడంతోపాటు, ప్రకృతిని, విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయీకరణ చెందిన పోటీ ప్రపంచంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలో క్రియాశీలకంగా వ్యహరించని ఏ దేశమూ ఆర్థికంగా, రాజకీయంగా పురోగతి సాధించలేదు. విజ్ఞానశాస్త్రంలో విజయాలు ప్రపంచ మార్కెట్‌లో ఆయా దేశాల పురోగతిపై ప్రభావం చూపుతాయి. శాస్త్ర పరిశోధనలో సాంకేతిక నవకల్పనలు అధిక వేతనాల కల్పనకు ప్రోత్సాహాన్నిస్తూ, దీర్ఘకాలంలో ఆర్థికవృద్ధికి దారితీస్తాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ పరిశోధనలకు అధిక ప్రాధాన్యమిస్తాయి. ఆర్థికవృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ శాస్త్ర పరిశోధనకు ప్రధాన లక్ష్యాలుగా ఉండాల్సిన అంశాలు. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లడం, డేటా అనలిటిక్స్‌, యంత్రాలు, రోబోల వాడకం పెరుగుదల, పరిశ్రమల్లో యాంత్రికీకరణ, ఇతర గ్రహాలకు ప్రయాణాలు, జీవవైద్య ఇంజినీరింగ్‌ తదితర రంగాల్లో విజయాలు వంటివి విజ్ఞానశాస్త్ర పరిశోధన ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఈ క్రమంలో దేశంలోని యువతరాన్ని శాస్త్ర పరిశోధనల దిశగా నడిపించడం అవసరం.

అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ చేపట్టిన విద్యానాణ్యత ఉన్నతీకరణ, సమ్మిళిత కార్యక్రమం (ఎక్విప్‌) నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవాప్తంగా గణనీయ సంఖ్యలో పరిశోధక, సాంకేతిక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సమకూరుస్తున్న, స్వయంపోషక విద్యాసంస్థలూ ఉన్నాయి. ఈ విషయంలో భారీ పెట్టుబడులు ఉన్నా పరిశోధన, నవకల్పన నాణ్యత ప్రపంచ ప్రమాణాలతో సరితూగడం లేదు. ఈ విద్యాసంస్థలకు ప్రపంచంలోని వంద ఉన్నతశ్రేణి పరిశోధన, నవకల్పనల ర్యాంకుల్లో చోటు దక్కలేదు. మనదేశంలో బడుల నుంచి ఉన్నత విద్యకు వెళ్లే విషయంలో చాలా అంతరం ఉంటోంది. భారత్‌లో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) సుమారు 19 శాతం. ప్రపంచ సగటు 25 శాతానికి ఇది ఆరు శాతం తక్కువ. భారత్‌లో 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు వారి సంఖ్య పది కోట్లదాకా ఉంది. 19 శాతం విద్యార్థులే, అంటే సుమారు రెండు కోట్ల మందే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారనుకోవాలి. జాతీయ పరిశోధన ఉత్పత్తిని పెంచాలనుకుంటే ఈ సంఖ్య బాగా మెరుగవ్వాలి. మనదేశంలోని ఉన్నత విద్యాసంస్థలు కేవలం డబ్బులు సంపాదించే బోధన దుకాణాలుగా కాకుండా, తమను తాము చక్కని పరిశోధన, బోధన అందించే సంస్థలుగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భారత పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రావాల్సిన పెట్టుబడులు దశాబ్దికాలంగా క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇవి 2008లో జీడీపీలో 0.84 శాతం ఉండగా, 2018 నాటికి 0.69 శాతానికి తగ్గిపోయాయి. ప్రపంచంలో పరిశోధన, అభివృద్ధిపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల్లో ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచాయి. 2019లో జీడీపీలో పరిశోధన అభివృద్ధి పెట్టుబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన దేశాల్లో ఇజ్రాయెల్‌ 4.3శాతం, దక్షిణకొరియా 4.2 శాతం, అమెరికా 2.8 శాతం, చైనా 2.1 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయి. భారత ప్రభుత్వం 2017లో ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐవోఈ) పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ 100 అగ్రశ్రేణి యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో, టైమ్స్‌ ఉన్నత విద్య ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల్లో స్థానం దక్కించుకోవాలనే లక్ష్యంతో కృషి చేసే విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధుల్ని, మరింత స్వయంప్రతిపత్తిని ఈ పథకం కింద సమకూరుస్తుంది. మరోవైపు, 2020 కేంద్ర బడ్జెట్‌లో సుమారు రూ.లక్ష కోట్లు విద్యారంగానికి కేటాయించడం ద్వారా కేంద్రం అందరి దృష్టి ఈ రంగంపై పడేలా చేసింది. 2019 బడ్జెట్‌లోనూ రూ.95 వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో తాజాగా కేటాయింపులు పెద్ద మొత్తమేమీ కాదు. డబ్బుల్ని సక్రమరీతిలో వ్యయం చేయడమే అసలు సమస్య. విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి అవకాశాలు కల్పించడం, దేశంలోని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలను ఆన్‌లైన్‌ డిగ్రీలు ఇచ్చేదిశగా ప్రోత్సహించడం వంటివి ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యపై రెండు సానుకూల ప్రతిపాదనలుగా చెప్పవచ్ఛు.


చేయాల్సింది కొండంత
ఒకదేశంలో నాణ్యమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు సంబంధించిన కొలమానాల్లో... ప్రపంచ నవకల్పనల సూచీ, ప్రపంచస్థాయితో పోటీపడే తీరు, మేధోసంపత్తి హక్కులు, అంతర్జాతీయ పత్రికల్లో శాస్త్రీయ అంశాల ప్రచురణల సంఖ్య, ఆ దేశంలోని ప్రతి వెయ్యి మందికి ఉండే శాస్త్రవేత్తల సంఖ్య వంటివాటిని ప్రామాణికాలుగా పరిగణిస్తారు. భారత్‌లో ప్రతి పది లక్షల మందికి కేవలం 137 మంది పరిశోధకులే ఉన్నారు. ‘నేచర్‌ ఇండెక్స్‌’ ప్రకారం 2018 డిసెంబరు ఒకటి నుంచి 2019 నవంబరు 30 వరకు 28,299 పరిశోధక పత్రాల ప్రచురణలతో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా, 17,711 ప్రచురణలతో చైనా రెండోస్థానంలో నిలిచింది. భారత్‌ 1,619 ప్రచురణలతో ప్రపంచ ర్యాంకుల్లో 12వ స్థానం సాధించింది. ప్రపంచంలోని అగ్రస్థాయి దేశాలతో పోలిస్తే పరిశోధనల విషయంలో భారత్‌ చేయాల్సిందెంతో ఉందని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన 2019 ప్రపంచ పోటీతత్వ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత పోటీతత్వ దేశాల్లో సింగపూర్‌, అమెరికా, హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ నిలిచాయి. తొలి పది దేశాల్లోనూ భారత్‌కు చోటు దక్కలేదు. 2018లో ప్రచురితమైన మొత్తం విజ్ఞానశాస్త్ర, ఇంజినీరింగ్‌ అంశాల శాస్త్రప్రచురణలను పరిశీలిస్తే- చైనా 5,28,262, అమెరికా 4,22,808తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ నుంచి 1,35,788 శాస్త్రప్రచురణలు మాత్రమే ప్రచురితమయ్యాయి.

సామర్థ్యం ఇనుమడించాలి
ప్రస్తుతం విజ్ఞానశాస్త్ర అంశాల బోధన పద్ధతుల్లో పలు లోపాలున్నాయి. ఈ క్రమంలో విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్తలు సరికొత్త నైపుణ్యాల సాయంతో సృష్టించే నవకల్పనలు, ఆవిష్కరణలపైనే మన సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పలు అంశాలను ఇప్పుడు సరికొత్త రీతిలో ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. విజ్ఞానశాస్త్ర బోధనను రోజువారీ సాధారణ వ్యవహారంలా కాకుండా ప్రేరణాత్మకంగా, నవకల్పనలతో, చిత్తశుద్ధితో చేపట్టాల్సి ఉంటుందనేది వాస్తవం. శాస్త్ర విద్యలో పాఠ్యాంశాల్ని పరిశోధక కోణంలో తీర్చిదిద్దితే ఈ రంగంలో మన సామర్థ్యం ఇనుమడించే అవకాశం ఉంది. విద్యార్థుల దృష్టి కోణాన్ని శాస్త్రవిజ్ఞానం దిశగా మళ్లించేందుకు తరగతి గదిలో కొన్ని సరికొత్త పద్ధతుల్ని అమలు చేయాలి. విషయ ఆధారిత అభ్యసన, కథలు చెప్పటం, పాత్రల పోషణ, దృశ్య సంబంధ వివరణ, పదక్రీడలు, ఇన్ఫోగ్రాఫిక్‌లు, సామాజిక మాధ్యమం, వాస్తవిక సైన్స్‌ ల్యాబ్‌లు, ఆలోచలు రేకెత్తించే పటాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలల సందర్శన, పలురకాల ప్రాజెక్టులు, సైన్స్‌ క్రీడలు, మొబైల్‌యాప్‌లు, వివిధ నమూనాల రూపకల్పన తదితర అంశాలతో, నవ్య ఆలోచనలతో విజ్ఞానశాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలి. వారిని ప్రయోగాల దిశగా ప్రోత్సహించాలి. శాస్త్రీయ భావనలు, నైపుణ్యాలు, విమర్శనాత్మక కోణంలో ఆలోచించడం తదితర అంశాలపై బోధకులు విద్యార్థులకు బోధించాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, సమస్యల పరిష్కారం విజ్ఞానశాస్త్ర పరిశోధనలో చాలా కీలకం. మాధ్యమిక విద్య, డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థుల్లో- స్వతంత్రంగా ఆలోచించే, విమర్శనాత్మక కోణంతో చూడగలిగే, సమస్యల్ని పరిష్కరించగలిగే నైపుణ్యాల్ని పెంపొందించే దిశగా దృష్టి సారించాలి. విజ్ఞాన రంగంలో తాజాగా నమోదయ్యే పరిశోధనలు, విజయాల గురించి విద్యార్థులకు వివరించాలి. విద్యార్థుల్లో శాస్త్రసాంకేతిక అంశాలపై ఆసక్తిని పెంచడమే విజ్ఞానశాస్త్ర విద్య లక్ష్యం కావాలి. ఉన్నత విద్యలో పరిశోధనలే లక్ష్యంగా ఉండాలి. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాల్ని నిర్లక్ష్యం చేయడం దీర్ఘకాలంలో దేశ ఆర్థికవృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకని, దేశంలో విజ్ఞాన రంగాల్లో బలమైన పరిశోధన దిశగా విద్యార్థుల్ని ప్రేరేపించడం అవసరం. ప్రభుత్వం బడులు, కళాశాలల్లో చక్కని ప్రయోగశాలలు తదితర సౌకర్యాల కల్పనపై గట్టిగా దృష్టిపెట్టాలి. అధిక మొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. పాఠశాలలు, కళాశాలలు ప్రయోగశాలల్లో అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించేందుకు అదనపు సమయాన్ని కేటాయించాలి. ఇలాంటి చర్యలు, కృషితో విద్యార్థుల మెదళ్లలో పరిశోధక కోణం పెరుగుతుంది. అది దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుంది. ఈ క్రమంలో ‘జాతీయ సైన్స్‌ దినం’ మన విద్యా వ్యవస్థపై పునఃసమీక్షకు, దేశీయ అవసరాలకు తగినట్లుగా మెరుగులు దిద్దుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పించే చక్కని సందర్భం.

Posted Date: 04-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం