• facebook
  • whatsapp
  • telegram

  కారుచీకట్లోనూ కాంతిరేఖలు

* మానవాళి ఆయుష్షు పెంచుతున్న సాంకేతికత

గడచిన దశాబ్ది అంతా కష్టాలు, సవాళ్లతో ఆందోళనాభరితంగా సాగిందని చాలామంది భావిస్తున్న సమయంలో, అందుకు పూర్తి విరుద్ధమైన సూత్రీకరణతో సైన్స్‌ రచయిత మ్యాట్‌ రిడ్లే ముందుకొచ్చారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభంవల్ల గత దశాబ్దంలో ప్రపంచంలో అభివృద్ధి పడకేసిందని మేధావులు, విధానకర్తలు వాపోతున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంతవరకు మనం వీక్షించిన దశకాల్లో గత దశాబ్ద కాలమే ఎంతో మిన్న అని రిడ్లే ఉద్ఘాటించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. గత దశాబ్దంలో మానవ జీవన ప్రమాణాలు చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మెరుగుపడ్డాయని రిడ్లే చాటారు. బ్రిటిష్‌ పత్రిక ది స్పెక్టేటర్‌లో రాస్తూ ప్రపంచ జనాభాలో దుర్భర దారిద్య్రంతో అగచాట్లపాలవుతున్నవారి సంఖ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా పది శాతం లోపునకు దిగివచ్చిందని ఆయన వివరించారు. శిశు మరణాలు ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి తగ్గిపోయాయని, కరవు కాటకాలు దాదాపుగా అదృశ్యమైపోయాయనీ, మలేరియా, పోలియో, హృద్రోగాలు తగ్గుముఖం పడుతున్నాయని విశదీకరించారు.

పేదరికంపై విజయం
రిడ్లే మాటల్లో నిజం లేకపోలేదు. భారతదేశంలోనూ దుర్భర దారిద్య్రం తగ్గిపోతున్నది. రోజుకు 88 రూపాయలకన్నా తక్కువ సంపాదనతో సరిపెట్టుకుంటున్నవారిని దుర్భర దారిద్య్రంతో బాధపడుతున్నవారిగా నిర్వచించారు. 2012లో భారత జనాభాలో 22 శాతాన్ని ఈ కోవలో నిరుపేదలుగా వర్గీకరించారు. ఇప్పుడు వారి శాతం కేవలం 5.5కు పడిపోయింది. గడచిన 17 ఏళ్లలో భారతదేశం ఏటా ఏడు శాతం వృద్ధి రేటు సాధించడం వల్లనే ఇది సాధ్యపడింది. చైనా తరవాత దుర్భర దారిద్య్రంపై సమరంలో విజయం సాధిస్తున్నది భారతదేశమే. 1981లో చైనా జనాభాలో 88 శాతం (85 కోట్లమంది) పేదలు కాగా, 2015లో వారి సంఖ్య 0.7 శాతానికి తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2005-2017 మధ్య కాలంలో భారతదేశం 27.1 కోట్ల మందిని దారిద్య్రం నుంచి ఉద్ధరించిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సామాన్య మానవుడి శ్రేయస్సుకు భారత్‌ ఇంకా ఇతర చర్యలూ తీసుకుంది. ప్రభుత్వం పేద మహిళలకు ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వడం వల్ల లక్షల మంది వంటింటి పొగ కాలుష్యం నుంచి విముక్తులయ్యారు. వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. స్వచ్ఛ భారత్‌ పథకం కింద లక్షలాది పౌరులు మరుగుదొడ్లు నిర్మించుకోవడం వల్ల బహిర్భూముల్లో మల విసర్జన క్రమంగా కనుమరుగవుతోంది. జనారోగ్యాలకు, పర్యావరణానికి ముప్పు తొలగుతోంది. ఇవాళ అత్యధిక భారతీయులు సొంత ఊళ్లకు పక్కా రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు ఖాతాలు తెరచి ప్రత్యక్ష నగదు బదలీ (డీబీటీ) పథకాల ఫలాలు పొందుతున్నారు. అయినా, ఈ విజయాలకు విస్తృత ప్రాచుర్యం లభించలేదు. మనం దీర్ఘకాల దృష్టితో చరిత్రను వీక్షించడం లేదు. కాబట్టి, జనజీవితాలలో సంభవిస్తున్న నాటకీయ మార్పులను గమనంలోకి తీసుకోలేకపోతున్నాం. పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో సంచలన వార్తలు, దుర్వార్తలను చదవడానికి ప్రాధాన్యమిస్తూ మంచి వార్తలను పట్టించుకోవడం మానేశాం. ఇది చాలదన్నట్లు ప్రపంచంపై మన అభిప్రాయాలను మన దృష్టికోణం ప్రభావితం చేస్తుందని హాన్స్‌ రోస్లింగ్‌ విరచిత ‘ఫ్యాక్ట్‌ ఫుల్‌నెస్‌’ గ్రంథం వివరించింది. అందుకే ప్రపంచాన్ని సోవియట్‌, అమెరికా కూటములుగా, వర్ధమాన, సంపన్న దేశాలుగా విభజించి చూశాం, చూస్తున్నాం. పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందిన దేశాలని, ఆసియా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని వర్గీకరించడం పరిపాటి అయింది. అయితే, ఇటీవలి కాలంలో పేద దేశాలు అనేకం మధ్యాదాయ దేశాలుగా పురోగతి సాధించాయి. చైనా నేడు అమెరికాకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఒకప్పటి వర్ధమాన దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌- నేడు పాశ్చాత్య సంపన్న దేశాలకు దీటుగా నిలుస్తున్నాయి. ప్రపంచ జనాభా అడ్డూఆపూలేకుండా పెరిగిపోతూ మానవాళి భవిష్యత్తుకు చేటు తెస్తోందనే అభిప్రాయానికి కాలం చెల్లిపోతోంది. జపాన్‌, ఐరోపా దేశాల్లో జననాల రేటు తగ్గిపోతోంది. అక్కడి జనాభాకు ముదిమి మీదపడుతూ వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఆర్థికాభివృద్ధి నెమ్మదిస్తోంది. ఇకపై యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలదే భవిష్యత్తు. జనాభా పెరగకపోతే వలసల ద్వారానైనా ఆ లోటు భర్తీచేసుకోవాలి. లేదంటే ఆర్థికాభివృద్ధి పడకేస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించని సంపన్న దేశాల ప్రజలు వలసలను వ్యతిరేకించే మితవాద నాయకులకు అధికారం కట్టబెడుతున్నారు. 2008 ఆర్థిక మాంద్యానికి ప్రపంచీకరణే కారణం కాబట్టి- విదేశాలతో వ్యాపారాలను, అక్కడి నుంచి వలసలను అడ్డుకోవాలని భీష్మిస్తున్నారు. వారికి నచ్చే నినాదాలను, విధానాలను చేపట్టడం ద్వారా డోనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, బోరిస్‌ జాన్సన్‌, ఎర్డొగాన్‌, బోల్సెనారో వంటి మితవాద నాయకులు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు జగతికి శిరోధార్యాలుగా భావించిన విలువలకు దేశ నాయకులే నీళ్లు వదలడం విచారకరం. తరాల నుంచి పెంచి పోషించుకుంటున్న మహత్తర సంస్థల పునాదులు నేడు కదలిపోతున్నాయి. పలు దేశాల్లో అతి మితవాదులు రాజకీయ ప్రాధాన్యం సంపాదించుకోవడం అనిశ్చితిని సృష్టిస్తోంది. ప్రపంచానికి ఆర్థికంగా ముప్పు తీసుకొస్తోంది.

స్వదేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ తదితర సమస్యలపై సామాజికంగా అలజడి రేగడం, విద్యార్థులు ఆందోళనకు దిగడం చూస్తూనే ఉన్నాం. కశ్మీర్‌ ఇంకా దిగ్బంధంలోనే ఉంది. అసలే ఆర్థిక మందగతితో భారత్‌ సతమతమవుతుండగా, సామాజికంగా అలజడి పెరగడం ప్రగతికి శుభసూచకం కాదు. మరి ప్రపంచం ఎలా గట్టెక్కుతుందనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది. దీనికి జవాబేమిటంటే- ప్రపంచ పురోగతి కేవలం ప్రభుత్వాలు, దేశ నాయకుల మీదనే ఆధారపడి ఉండదని.

మంచా... చెడా?
శాస్త్ర, సాంకేతికతలు ఉగ్రవాద విజృంభణకు తావిస్తున్నాయనే వాదన లేకపోలేదు. కానీ, ఈ వాదన పెద్ద అతిశయోక్తి అని స్టీఫెన్‌ పింకర్‌ అనే రచయిత పేర్కొన్నారు. అమెరికా పౌరుడు ఉగ్రవాద దాడిలో మరణించే ప్రమాదంకన్నా రోడ్డు ప్రమాదంలో మరణించే అవకాశాలు మూడు వేల రెట్లు ఎక్కువని ఆయన చెప్పారు. నిజానికి శాస్త్రసాంకేతికతలు మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేశాయనీ, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ ఆయుష్షును పొడిగిస్తున్నాయని పింకర్‌ వివరించారు. ఏతావతా ప్రపంచం రోజురోజుకీ సంక్షోభంలో కూరుకుపోతోందని నిరాశావాదులు ఆందోళన వ్యాపింపజేస్తుంటే, అది నానాటికీ మెరుగుపడుతోందని ఆశావాదులు భరోసా ఇస్తున్నారు. ఈ రెండు వాదాల్లో ఏది నిజమంటే, రెండూ తమ తమ స్థాయిలో నిజమేనని చెప్పాలి. ప్రపంచంలో మంచి-చెడు రెండూ ఉన్నాయి. అవి ఏకకాలంలో ప్రభావం చూపుతుంటాయి. ఒక్కోసారి ‘మంచి’ది పైచేయి అయితే, మరికొన్ని సార్లు ‘చెడు’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్వల్పకాలంలో ‘చెడు’ది పైచేయి అయితే దీర్ఘకాలంలో ‘మంచి’ జయించవచ్చు. కాబట్టి, సమతుల్య దృష్టి అవసరం. భూతాపం, అతి మితవాద రాజకీయాలు భవిష్యత్తు మీద భయాందోళనలు రేకెత్తించవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పరిస్థితి మారవచ్చుననే ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. నిరాశలో ఆశను చూడటమంటే ఇదే. ఒక కవి అన్నట్లు వర్షం కురుస్తున్నప్పుడు ఇంద్ర ధనుస్సు వర్ణాలను చూసి పరవశించాలి, చీకటి కమ్మినప్పుడు నింగిలోని నక్షత్రాల వెలుగులో ముందుకు సాగాలి.


మారుతున్న జీవనశైలి
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలను మార్కెట్‌ శక్తులు ప్రపంచమంతటా వేగంగా వ్యాపింపజేయడం వల్ల వ్యాపారాలు, వృత్తిఉద్యోగాలు విజృంభించి, ఆర్థిక రథం జోరుగా పరుగిడుతుందని చరిత్ర చెబుతోంది. దీనికి విశిష్ట ఉదాహరణ సెల్‌ఫోనే. అది పేదలకు ఆర్థిక సాధికారతను సైతం సమకూర్చి పెడుతోంది. సెల్‌ఫోన్‌ ఇంకా అనేక విధాలుగా పేదలకు ప్రయోజనం చేకూరుస్తోంది. మొబైల్‌ సేవలు ప్రపంచమంతటా విస్తరించాయంటే మార్కెట్‌ శక్తుల మహిమే. టెలివిజన్‌, వాచీలు, వార్తా పత్రికలు, టార్చిలైట్లు, తపాలా, బ్యాంకు సేవలు, రికార్డు ప్లేయర్లు, కంప్యూటర్ల వంటి ఆధునిక ఆవిష్కరణలు జన జీవితాలను రూపాంతరం చెందించాయి. ఈ సేవలు, సాధనాలను విరివిగా అందుబాటులోకి తీసుకురావడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషించాయి. ఇక్కడ ఆరంభంలో ప్రభుత్వ పాత్ర పరిమితమే. కంపెనీలే వాటిని వ్యాప్తి చేశాయి. ఆధునిక సాంకేతికత వైద్య రంగాన్ని విప్లవీకరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ వల్ల రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణలో రేడియాలజిస్టుల అవసరం తీరిపోవచ్చని బ్రిటిష్‌ సైన్స్‌ పత్రిక ‘నేచర్‌’ ఇటీవల అంచనా వేసింది. క్యాన్సర్‌ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణలు వచ్చే ప్రమాదాన్ని కృత్రిమ మేధ నివారిస్తుంది. వైద్య పరీక్షల్లో కనిపెట్టలేకపోయిన క్యాన్సర్లను పసిగట్టేస్తుంది. ఇదంతా వైద్యులకు రోగ చికిత్సలో ఎంతో ఉపయుక్తం. వ్యాపారానికీ, నవ్య ఆవిష్కరణలకూ మధ్య సంబంధాన్ని ‘ది రేషనల్‌ ఆప్టిమిస్ట్‌’ అనే రచనలో రిడ్లే అద్భుతంగా వర్ణించారు. ఒకప్పుడు సైన్స్‌ రచయిత అయిన రిడ్లే తరవాత ఆర్థిక వ్యవహారాల అధ్యయనాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆయన రచనల్లో మార్కెట్‌ మహిమకు మరీ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు అనిపించినా, ఆయన వాదనలో బలమైన అంశాలు ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. సాంకేతిక నవీకరణల వల్ల వ్యాపారం విస్తరించి, మరిన్ని నవీకరణలకు దారి తీస్తుందని రిడ్లే సూత్రీకరించారు. వస్తు సేవల క్రయవిక్రయాలు తెచ్చిపెట్టే లాభాలు కొత్త సాంకేతికతల ఆవిష్కరణకు పెట్టుబడిగా మారి మరింతగా వ్యాపార వృద్ధికి దోహదం చేస్తాయి.

Posted Date: 06-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం