• facebook
  • whatsapp
  • telegram

వైఫల్యాల నిరోధానికి నిఘా

ప్రైవేటు బ్యాంకులపై ఆచితూచి అడుగెయ్యాలి
 

ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య పద్ధతులు, ప్రమోటర్ల వాటా పరిమితులు, లైసెన్సింగ్‌ విధానం వంటి అంశాలపై ఆర్‌బీఐ అంతర్గత కార్యాచరణ బృందం పలు కీలక సిఫార్సులు చేసింది. ప్రైవేటురంగ బ్యాంకుల యాజమాన్య విధానాలను సమీక్షించి కొంతకాలంగా బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించే లక్ష్యంతో ఆర్‌బీఐ పి.కె.మహంతి నేతృత్వంలో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేసింది. రిజర్వు బ్యాంకుకు సమర్పించిన తమ నివేదికలో ఈ కార్యాచరణ బృందం ప్రైవేటు బ్యాంకుల స్థాపనకు అనుకూలంగా పలు సిఫార్సులు చేసింది. పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ప్రైవేటు బ్యాంకులు స్థాపించేందుకు మార్గం సుగమం చేసింది. పదేళ్లుగా మంచిపని తీరుతో సమర్థంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ కనీసం రూ.50వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులుగా మారే అవకాశాన్ని కల్పించాలని పేర్కొంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. కొత్తగా ప్రైవేటు బ్యాంకులు స్థాపించేందుకు వాటికి అవసరమైన మూలధన నిబంధనల్లో కొన్ని మార్పులు ప్రతిపాదించింది. యూనివర్సల్‌ బ్యాంకుల స్థాపనకు ప్రస్తుతం కనీస మూలధన పరిమితిని రూ.1000కోట్లకు పెంచాలని తెలిపింది. చిన్న ఆర్థిక బ్యాంకుల కనీస మూలధన పరిమితిని రూ.300కోట్లకు పెంచింది. చెల్లింపు బ్యాంకులు చిన్న ఆర్థిక బ్యాంకులుగా మారేందుకు కాలపరిమితిని మూడేళ్లకు కుదించాలని ప్రతిపాదించింది.
 

సాధ్యాసాధ్యాలు
దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యం పాలబడటంతో పాటు బ్యాంకింగ్‌ రంగం మునుపెన్నడూ ఎరుగని వరస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు భారీ నిరర్థక ఆస్తుల భారంతో బ్యాంకులు కుంగిపోతున్నాయి. మరోవైపు కొవిడ్‌ ప్రేరేపిత మాద్యంతో రుణ గిరాకీ, వ్యాపారాభివృద్ధి క్షీణిస్తున్నాయి. విలీనాలతో బ్యాంకింగ్‌ రంగంలో ఏకీకరణ ఊపందుకుంటోంది. కొంతకాలంగా ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలు పెరుగుతూ ఆందోళన పరుస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్‌బీఐ కార్యాచరణ బృందం సిఫార్సులు ఏ మేరకు ఆమోదయోగ్యమన్నది చర్చనీయాంశంగా మారింది. 1993లో తొలిసారిగా కొత్తతరం ప్రైవేటు బ్యాంకుల రంగ ప్రవేశంతో దేశ బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యాంకుల మధ్య పోటీ స్ఫూర్తి పెరిగి వినియోగదారుడికి అత్యాధునిక బ్యాంకింగ్‌ సేవలందుకొనే భాగ్యం కలిగింది.  అయితే, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, కొత్త ప్రైవేటు బ్యాంకుల స్థాపనకు ఇది సమయం కాదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థల వైఫల్యాలతో కుదేలైన ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులుగా మారే అవకాశం ఇచ్చినా అందుకు అవి సిద్ధపడకపోవచ్చు.
 

అప్రమత్తంగా వ్యవహరించాలి
ప్రైవేటు బ్యాంకుల లైసెన్సింగ్‌ విధానాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్‌ వర్గాలకు, పారిశ్రామికవేత్తలకు ప్రైవేటు బ్యాంకులను స్థాపించే అవకాశం ఇవ్వడం శ్రేయస్కరం కాదని అవి సూచిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలను సకాలంలో గుర్తించి వాటిని అరికట్టడంలో ఆర్‌బీఐ విఫలమైందనడంలో సందేహం లేదు. ప్రైవేటు బ్యాంకుల స్థాపనకు కార్పొరేట్‌ సంస్థలను అనుమతించే విషయంలో రిజర్వు బ్యాంకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. 1993లో తొలిసారిగా ప్రైవేటు బ్యాంకులకు లైసెన్సులు జారీకాగా, ఇప్పటిదాకా కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకు లైసెన్సులు జారీ చేయలేదు. 2014లో దాదాపు 26 సంస్థలు దరఖాస్తు చేసుకోగా కేవలం రెండు సంస్థల (ఐడీఎఫ్‌సీ బ్యాంకు, బంధన్‌ బ్యాంకు)కే బ్యాంకింగ్‌ లైసెన్సులు జారీ చేసింది. అప్పట్లో పార్లమెంటరీ కమిటీ సైతం కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేటు బ్యాంకులను స్థాపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ బ్యాంకింగ్‌ రంగ నిరర్థక ఆస్తుల్లో దాదాపు 70శాతంపైగా పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు చెందినవే! అంతేకాక పీఎస్‌బీలు పీకల్లోతు ఎన్‌పీఏల ఊబిలో కూరుకుపోయి కొన్ని బ్యాంకులు వాటి ఉనికిని సైతం కోల్పోవడానికి ప్రధానంగా కార్పొరేట్‌ రంగ పారు బకాయిలే కారణం. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ సంస్థలకు, పారిశ్రామిక దిగ్గజ సంస్థలకు ప్రైవేటు బ్యాంకుల స్థాపనకు అనుమతించడంలో ఔచిత్యం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవాటిని ప్రోత్సహించడంకన్నా ఇప్పుడున్న వాటినే ఏకీకరణ చేసి పారుబాకీల తీవ్రతను తగ్గించడం అత్యావశ్యకం. చెల్లింపు బ్యాంకులు చిన్న ఆర్థిక బ్యాంకులుగా మారేందుకు ఇప్పుడున్న అయిదేళ్ల కాలపరిమితిని యథాతథంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలను అరికట్టే దిశలో రిజర్వు బ్యాంకు తమ నియంత్రణ, నిఘా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రైవేటు బ్యాంకుల గురించి ఆలోచించాలి!

 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం