• facebook
  • whatsapp
  • telegram

పన్నుల ఎగవేతను అరికట్టాలంటే?

జీఎస్టీపై పర్యవేక్షణ కీలకం

ఈ లోకంలో మరణం, పన్నులు తప్ప మరేదీ నిశ్చితం కాదని విజ్ఞులు అంటారు. జనానికి నచ్చినా నచ్చకపోయినా ఈ మాటలు ముమ్మాటికీ నిజం. పన్నులు చెల్లించనివారితో పన్నులు పూర్తిగా కట్టించడం ఏ ప్రభుత్వానికైనా సవాలే. చాలా సందర్బాల్లో పౌరులు అవగాహన లేక పన్నులు కట్టడం మానేస్తుంటారు. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి సంక్లిష్ట పన్నుల వ్యవస్థ ఉన్న భారత్‌ వంటి దేశంలో ఇలాంటి ధోరణి సర్వసాధారణం. 2020 జూన్‌ నాటికి దేశంలో మొత్తం 1.28 కోట్ల రిజిస్టర్డ్‌ పన్ను చెల్లింపుదారులు ఉండగా, వారిలో 76.75 లక్షలమంది మాత్రమే పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వీరిలో 11.54 లక్షలమంది అయిదు లక్షల రూపాయలలోపు శ్లాబులో ఉండగా, 31,878 మంది రూ.100 కోట్లు-రూ.500 కోట్ల శ్లాబులో ఉన్నారు. రూ.500 కోట్లను మించిన శ్లాబులో కేవలం కేవలం 7,496 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఈ రెండు పైఅంచెల్లోనివారు మొత్తం పన్ను చెల్లింపుదారులలో 0.38 శాతమే. కానీ, 75శాతం ఇన్వాయిస్‌లు దాఖలు చేసేదీ, మొత్తం పన్నుల్లో 65శాతం చెల్లించేదీ ఈ రెండు శ్లాబులవారే! లోగడ అమలు చేసిన అనేక పన్నుల వ్యవస్థల్లో మాదిరిగానే, జీఎస్టీ విధానంలోనూ పన్ను ఎగవేతలు, మోసాలు ఎక్కువే. 2017 జులై ఒకటిన జీఎస్టీ విదానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం రూ.70,000 కోట్ల పన్ను ఎగవేత కేసులు కనిపెట్టామని, అందులో సగం మొత్తాన్ని రాబట్టామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గత మార్చిలో లోక్‌సభకు తెలిపారు. అయినా పన్ను ఎగవేతలు ఆగలేదు.

లోపాలను సవరిస్తేనే...
కొవిడ్‌ మూలంగా పన్ను చెల్లింపులపై కాస్త పట్టువిడుపు ప్రదర్శిస్తూ వచ్చిన కేంద్రం, అక్టోబరు నుంచి మళ్లీ జీఎస్టీ ఎగవేతదారులపై కొరడా ఝళిపించసాగింది. గడచిన నెలరోజుల్లోనే 38 నగరాల్లో దాడులు జరిపి 4,600 జీఎస్టీఐఎన్‌ సంస్థలపై 1,430 కేసులు దాఖలు చేశారు. జీఎస్టీ ఎగవేత కేసులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయంటే, జీఎస్టీ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని అర్థం. 2018-19లో రూ.11,250 కోట్ల ఎగవేతకు సంబంధించి 1,600 కేసులు దాఖలు కావడం దీనికి నిదర్శనం. సాధారణంగా తప్పుడు ఇన్వాయిస్‌లతో మోసపూరితంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్ల(ఐటీసీ)ను క్లెయిమ్‌ చేయడం ద్వారా జీఎస్టీ మోసాలు జరుగుతుంటాయి. కేవలం తప్పుడు ఇన్వాయిస్‌లను జారీ చేయడానికే పలు బోగస్‌ కంపెనీలు పుట్టుకురావడం అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ బోగస్‌ కంపెనీలు తమలోతాము లావాదేవీలు నడుపుకొంటూ ఐటీసీలను క్లెయిమ్‌ చేస్తూ ఉంటాయి. ఇలాంటివాటిలో అతిపెద్ద కేసు ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. అక్కడ 2018 మార్చి- 2019 అక్టోబరు మధ్య రూ.400 కోట్ల మేరకు మోసం జరిగింది. ఆపైన ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు చాలానే వెలుగులోకి వచ్చాయి.

పన్ను ఎగవేతలను నివారించడానికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కట్టుదిట్టం చేయాలని జీఎస్టీ మండలికి చెందిన న్యాయ సలహా బృందం సిఫార్సు చేసింది. ఫొటోలు, ఇతర వివరాలతో ఆధార్‌ తరహాలో జీఎస్టీ సేవాకేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదన కాగితాలపై బాగానే ఉంటుంది కానీ, ఆచరణలో ఆశించిన ప్రయోజనాలు సిద్దిస్తాయా... అనేది అనుమానమే. ఈ కొత్త పద్ధతిలోనూ బోగస్‌ సంస్థల రిజిస్ట్రేషన్‌ జరగదనే భరోసా ఏమీ లేదు. పైగా ఈ ఏడాది మార్చి నుంచి జీఎస్టీకి ఆధార్‌ ఈకేవైసీ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. అలాంటప్పుడు మళ్లీ ఆధార్‌ ఫక్కీలో రిజిస్ట్రేషన్‌ చేపట్టాలనడం వల్ల డబ్బు వృథాకావడం తప్ప గొప్ప ఫలితాలేమీ లభించవు.

దీనికన్నా మెరుగైన పద్ధతి జూన్‌ నుంచి అమలులోకి వచ్చింది. దీనికింద జీఎస్టీ, ఎక్సైజ్‌, వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్నుల సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డుల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ రెండు బోర్డుల వద్ద వ్యక్తులు, సంస్థల పన్ను సమాచారం కంప్యూటర్‌ డేటాబేస్‌లలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి, పన్ను ఎగవేతలను కచ్చితంగా పసిగట్టి సత్యర చర్య తీసుకోవడం వీలవుతుంది.

భావి కార్యాచరణ
పన్నుల చట్టాలను గౌరవించకపోవడం, పన్నులు ఎగవేయడం ఖజానాకు తీరని నష్టం కలిగిస్తాయి. కొవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. సంక్షేమం, అభివృద్దిపై ప్రభుత్వాలు ఏటా పెద్ద మొత్తాలు వెచ్చించాల్సి ఉంటుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ వ్యయమూ పెరిగిపోతోంది. వీటన్నింటినీ తట్టుకోవాలంటే ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావాలి. కానీ, పన్ను ఎగవేతలు ఆదాయ అంచనాలను తలకిందులు చేస్తాయి. చివరకు ప్రజలే తీవ్రంగా నష్టపోతారు. ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి పన్నులను ఎప్పటికప్పుడు పెంచుకొంటూ పోవడమే ఏకైక పరిష్కారమని ఆర్థిక మంత్రులు భావిస్తారు. బడ్జెట్‌లో పన్నుల వడ్డన అనివార్యమని నిశ్చయించుకుంటారు. ప్రస్తుతం జీఎస్టీ పెంపుపైనే ఆర్థిక మంత్రుల కన్ను పడుతోంది. కానీ, ప్రజలు, వ్యాపార సంస్థలు కట్టే అనేకానేక పన్నుల్లో జీఎస్టీ ఒక్కటి మాత్రమే. మన దేశంలో పన్ను రేట్లు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతే ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఉత్పత్తి కుంటువడుతుంది. అది ఉద్యోగావకాశాలపైన, పన్నుల ఆదాయంపైన మళ్లీ ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కమాటలో ఇదంతా పెద్ద విషవలయం. ఒకవైపు పెట్రో ధరలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం జీఎస్టీని కూడా పదేపదే పెంచితే అనర్థమే తప్ప ప్రయోజనం ఉండదు. దీనికన్నా రాష్ట్రాలు మరింత సమర్థంగా జీఎస్టీ వసూళ్లను సాధించి, అందరూ సక్రమంగా పన్నులు కట్టేట్లు చూస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. 2019-20లో 18 రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు సక్రమంగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయకపోవడం వల్ల ఖజానాకు రూ.92,014 కోట్ల మేరకు గండి పడిందని 2020 మార్చినాటి అధ్యయనం తేల్చింది. ఇది దేశంలో ఒక నెల జీఎస్టీ వసూళ్లకు దాదాపు సమానం. ఈ పరిస్థితిని సరిదిద్దడంపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలి తప్ప- అదేపనిగా జీఎస్టీ రేట్లను పెంచుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించాలి!

ప్రభుత్వ ప్రతిచర్యలు
ఆధునిక టెక్నాలజీ సాయంతో జీఎస్టీ మోసాలు, ఎగవేతలను పసిగట్టడం ప్రభుత్వానికి సులువవుతోంది. ఆరు నెలల నుంచి జీఎస్టీఆర్‌-38 రిటర్నులు దాఖలు చేయని 1.63 లక్షల సంస్థలను టెక్నాలజీ సాయంతోనే పట్టేసి, వాటి జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దుచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే- 80శాతం పన్నుచెల్లింపుదారులు చిన్న వ్యాపార సంస్థలవారేనని. వీరిలోనూ 80శాతమే సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తుంటారు. మిగతావాళ్లకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు లేదా రిటర్నులు దాఖలు చేయడం అనివార్య కారణాలవల్ల ఆలస్యమై ఉండవచ్చు. ప్రభుత్వం ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి.

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం