• facebook
  • whatsapp
  • telegram

చిన్న పరిశ్రమలకు దన్ను

బలోపేతం కావాల్సిన ‘ఆత్మ నిర్భర్‌’

కొవిడ్‌వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2020 మే నెలలో మూడు లక్షల కోట్ల రూపాయల అత్యవసర రుణహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద బీమాసంస్థకు చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రం భరించి, రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణ బకాయిలవల్ల ఏమాత్రం నష్టం వాటిల్లకుండా రుణహామీ మంజూరుచేసింది. రూ.25కోట్ల రుణ పరిమితి దాటని చిన్నతరహా పరిశ్రమలకు (2020 ఫిబ్రవరి మాసాంతానికి రుణబకాయి అరవైరోజులకు మించకుండా)- బ్యాంకులనుంచి  అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటు ఈ అత్యవసర రుణ హామీపథకం కలిగిస్తుంది.

ఫలితాలు అంతంతమాత్రం
ఆగస్టునెలలో ప్రభుత్వం ఈ పథకాన్ని రూ.25కోట్ల నుంచి రూ.50 కోట్ల రుణ పరిమితిగల చిన్నతరహా పరిశ్రమలకూ వర్తించేలా సవరించింది. వృత్తిరంగంలో ఉన్న వైద్యులు, న్యాయవాదులు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌కూ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరింపజేసింది. రుణ మొత్తాన్ని అయిదు కోట్ల రూపాయల నుంచి రూ.10కోట్లకు పెంచింది. దీంతోపాటు ఈ పథకంకింద రుణాలు పొందే కంపెనీల అర్హతను ప్రభుత్వం సడలిస్తూ వాటి ఆదాయ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది. ఈ అత్యవసర రుణహామీ పథకం 2020 అక్టోబర్‌ వరకు అమలులో ఉంటుందని తొలుత కేంద్రం ప్రకటించింది. కానీ 2020 ఆగస్టు నాటికి బ్యాంకులు ఈ పథకం కింద రూ.2.03 లక్ష కోట్ల రుణాలను 60.67 లక్షల రుణగ్రహీతలకు మంజూరు చేయగా, కేవలం రూ.1.48 లక్షల కోట్ల విలువగల రుణాలు మాత్రమే విడుదలయ్యాయి. దరిమిలా ఈ పథకాన్ని ప్రభుత్వం నవంబరు నెల వరకు, మళ్ళీ 2021 మార్చి వరకు పొడిగించింది. ఆర్‌బీఐ నియమించిన కామత్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం ఆర్థిక మాంద్యానికి గురైన 26 రంగాలనూ ఈ పథకం కింద చేరుస్తూ పథకాన్ని మరింత సరళీకృతం చేసి రుణాలను చెల్లించే కాల పరిమితిని ప్రభుత్వం అయిదేళ్ల నుంచి ఆరేళ్లకు పొడిగించింది. ఈ పరిణామాలను బట్టి అంచనా వేస్తే ఒకవిధంగా ఈ అత్యవసర రుణ హామీ పథకం ప్రభుత్వం ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. ఈ పథకం అమలును అధ్యయనం చేసేందుకు జాతీయ రుణ హామీ సంస్థ పుణేకి చెందిన ప్రముఖ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐబీఎమ్‌)ను నియమించింది. ఎన్‌ఐబీఎం నివేదిక ప్రకారం... అత్యవసర రుణ హామీ పథకంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విరివిగా సన్నకారు రుణాలు ఇవ్వగా, ప్రైవేటు బ్యాంకులు ప్రధానంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధికంగా ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం రుణాల్లో ఉత్పాదక రంగానికి చెందిన చిన్నతరహా పరిశ్రమలకు తక్కువ రుణాలు ఇచ్చినట్లు వెల్లడయింది. ఎక్కువమంది రుణగ్రహీతలు ఈ అత్యవసర రుణ హామీ పథకంలో తీసుకున్న రుణాలని తమ బకాయిలను చెల్లించడానికి వినియోగించినట్లు, దీర్ఘకాలిక వ్యాపార ప్రయోజనాలకోసం తక్కువ మొత్తాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో 1,722 సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ పథకం లాక్‌డౌన్‌వల్ల ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు బాగా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడయింది.

అధ్యయనంలో పాల్గొన్న బ్యాంకుల అభిప్రాయం ప్రకారం- తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రభావంవల్ల పలు చిన్న తరహా పరిశ్రమలు కుదేలవడంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ అదనపు వెసులుబాటులో రుణాలు తీసుకోవడానికి తటపటాయించినట్లు వెల్లడయింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన పత్రాల సమర్పణ షరతులు కొంత ఇబ్బందికరంగా ఉండటంతో చాలామంది ఈ పథకం కింద అర్హత కలిగినప్పటికీ రుణాలు తీసుకోవడానికి వెనకంజ వేసినట్లు తెలుస్తోంది. మంజూరు చేసే రుణం తమ అవసరాలకు పూర్తిగా సరిపోదని కొంతమంది రుణగ్రహీతలు అభిప్రాయపడ్డారు.

ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కానీ చిన్న తరహా పరిశ్రమలు బ్యాంకుల్లో అదనపు రుణాలను తీసుకోవని పై పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సత్వరమే తీసుకోవలసిన చర్యల్లో ప్రధానమైంది- పెద్దయెత్తున ఉపాధి కల్పన. ఇది కేవలం ప్రభుత్వం మాత్రం చేయగలిగిన పని. దేశవ్యాప్తంగా అర్ధాంతరంగా ఆగిపోయి, లేదా జాప్యం వల్ల అసంపూర్ణంగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల సంఖ్య 412. ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టగా జాప్యం వల్ల అదనంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. వీటిలో కీలకమైన ప్రాజెక్టులను గుర్తించి వాటిని వేగవంతం చేస్తే తద్వారా కొన్ని లక్షల శ్రామికులకు ఉపాధి లభించి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు అనుబంధంగా సిమెంట్‌, స్టీల్‌, ఇతర నిర్మాణ పరికరాల తయారీ రంగాల్లో తదనుగుణంగా గిరాకీ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. క్రమేపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని చిన్న తరహా పరిశ్రమలు, ఇతర వర్తక వాణిజ్య ఉత్పాదక రంగాలు ఊపందుకుంటాయి. బ్యాంకుల్లో అదనపు రుణాలను వినియోగించుకునే అవకాశం బలపడుతుంది. ప్రభుత్వం ఈ దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డాక్టర్‌ బి.ఎన్‌.వి.పార్థసారథి
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం