• facebook
  • whatsapp
  • telegram

అదనపు ఆదాయమంతా కేంద్రానికే!

సెస్సుల్లో వాటా కోసం రాష్ట్రాల డిమాండ్‌

ఇప్పటికే ఉన్న సెస్సులు చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రకటించే కొత్త బడ్జెట్లో ఒకటో రెండో కొత్త సెస్సులు విధించే అవకాశముంది. కొవిడ్‌ నిరోధానికి వ్యాక్సిన్లపైనా, ఇతర విధాలుగా ప్రభుత్వం చేసే ఖర్చును తట్టుకోవడానికి ప్రత్యేక సెస్సు విధించవచ్చు. అలాగే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వల్ల పెరిగిన రక్షణ వ్యయాన్ని భరించడానికి మరొక సెస్సు విధించే అవకాశముంది. ఈ సెస్సులను అధికాదాయ వర్గాలపైన, కొన్ని పరోక్ష పన్నులపైన విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. మరికొందరైతే పెట్రోలియం, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకంపై కానీ, కొన్ని కస్టమ్స్‌ సుంకాలపై కానీ సెస్సు విధించాలని ప్రతిపాదించారు. కొవిడ్‌ కష్టకాలంలో తమ ఆదాయాలు పడిపోయినందు వల్ల కొత్త పన్నులు విధించరాదని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరడంతో, సర్కారు అదనపు ఆదాయం కోసం సెస్సుల బాట పడుతున్నట్లుంది. దేశమంతటా పౌరులు ఉద్యోగ, వ్యాపార నష్టాలకు గురైనందువల్ల వారి ఆదాయాలు పడిపోయాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం పెద్ద సంఖ్యలో దివాలాలను చవిచూసింది. ఈ పరిస్థితిలో పన్ను రేట్లను పెంచడం మొదటికే మోసం తెస్తుంది. కానీ, వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే మౌలిక వసతులు, ఆత్మనిర్భర్‌ భారత్‌, గ్రామీణ ఉపాధి హామీ వంటి కార్యక్రమాలపై పెద్దయెత్తున నిధులు వెచ్చించాలి. దేశమంతటా కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయడానికి రూ.65,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ నిధులను సమీకరించడానికి కేంద్ర సర్కారు పన్ను రేట్లను కాకుండా సెస్సులను పెంచే అవకాశం కనిపిస్తోంది.

పరిస్థితి మారాలి

సెస్సుల ద్వారా వచ్చే అదనపు ఆదాయమంతా కేంద్రానికే దఖలు పడుతున్నదే తప్ప తమకేమీ ఒరగడంలేదని రాష్ట్రాలు చాలాకాలంగా అభ్యంతరపెడుతున్నాయి. కొవిడ్‌ వల్ల రాష్ట్రాలూ ఆర్థికంగా చితికిపోయాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఓ పక్క సహకార సమాఖ్యవాదం గురించి గట్టిగా చెబుతూనే- ఆదాయంలో తమకు న్యాయమైన వాటాకు గండి కొడుతోందని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. రాజ్యాంగంలోని 270వ అధికరణ కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవలసిన విభాజ్య నిధిలోకి వచ్చే పన్నుల గురించి వివరిస్తుండగా, 271వ అధికరణ సెస్సులు, సర్‌ఛార్జీల గురించి ఏకరువు పెడుతోంది. వీటిని రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరం లేదు. ఈ పరిస్థితి మారాలని తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పన్ను మీద పన్ను

సెస్సులు, సర్‌ఛార్జీలను పన్ను మీద పన్నుగా భావించాలి. ఇవి బ్రిటిష్‌ పాలనలోనూ ఉన్నాయి. భారత్‌లో మొట్టమొదటి సెస్సును అగ్గిపెట్టెలపై విధించారు. స్వతంత్ర భారతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం ఉప్పు, తేయాకుపై సెస్సు వేశారు. తరవాత కార్మిక సంక్షేమం కోసమూ విధించేవారు. ఇనుము, సున్నపురాయి, డోలమైట్‌ గనులు, సినీ కార్మికుల కోసం సెస్సులు వసూలు చేశారు. 1944 నుంచి మొత్తం 42 సెస్సులు విధించారు. 2017లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చాక చాలా సెస్సులు రద్దయ్యాయి. 17 సెస్సులను జీఎస్టీలో కలిపేశాక కూడా 35 సెస్సులు అమలులో ఉన్నట్లు కాగ్‌ తెలిపింది. ముడి చమురు సెస్సు వసూళ్లను చమురు రంగంలో ఏ పరిశ్రమకూ కేటాయించలేదని; విద్య, ఆరోగ్య సెస్సు మొత్తాల్లో ఆరోగ్యం కోసం ఏమీ ఖర్చు చేయలేదని కూడా పేర్కొనడం గమనార్హం. సర్‌ఛార్జీలను అధిక ఆదాయపరులపై విధిస్తారు. భారత్‌లో కోటి రూపాయలకన్నా ఎక్కువ వార్షికాదాయం కలిగినవారు తమ ఆదాయపన్నులో 15శాతాన్ని సర్‌ఛార్జిగా చెల్లించాలి. కోటి రూపాయలకన్నా ఎక్కువ లాభం ఆర్జించే కంపెనీలు తమ పన్నులో 7.5 శాతాన్ని సర్‌ఛార్జిగా చెల్లించాలి. ఆదాయపన్నుపై భారత్‌ చాలా ఎక్కువ సర్‌ఛార్జి విధిస్తోంది. చాలా దేశాల్లో ఈ పద్ధతి లేదు.

సెస్సులు, సర్‌ఛార్జీలను మౌలిక పన్నుల్లో కలిపేస్తే, రాష్ట్రాలకూ సముచిత వాటా లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సూచించారు. కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జీలను రద్దు చేసి మౌలిక పన్ను రేట్లను పెంచితే రాష్ట్రాలకు న్యాయమైన వాటా లభిస్తుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, కేంద్రం మౌలిక పన్ను రేట్లను తగ్గిస్తోందే తప్ప పెంచడం లేదు. పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్నుల ఆదాయం, అందులో రాష్ట్రాల వాటా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు 2017-18 బడ్జెట్లో కేంద్రం అయిదు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయంపై పన్నును 10 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించి వేతన జీవుల మన్ననలు చూరగొంది. దీనివల్ల కలిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి 50 లక్షల రూపాయలకు మించిన వ్యక్తిగత ఆదాయాలపై సర్‌ఛార్జీ విధించినా- అందులో నుంచి రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. 2018-19 బడ్జెట్లో పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు తొమ్మిది రూపాయల మేరకు తగ్గించి, రోడ్డు సెస్సును తొమ్మిది రూపాయలు పెంచింది. ఈ విధంగా కేంద్రం తన బాగు తాను చూసుకొంటూ రాష్ట్రాల వాటాకు గండికొడుతోందనే విమర్శలు మిన్నంటుతున్నాయి.

పెరుగుతున్న అభ్యంతరాలు

విభాజ్య నిధి నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని 2015లో 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించినా, 2019-20 వచ్చేసరికి రాష్ట్రాల వాటా 35.7 శాతానికి మాత్రమే పెరిగింది. మరోవైపు కేంద్ర పన్ను ఆదాయంలో సెస్సులు, సర్‌ఛార్జీల ద్వారా దఖలుపడే వాటా 2013లో 8.9 శాతం ఉండగా- 2019లో అది 15.2 శాతానికి పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 15.6 శాతానికి పెరగనుంది. సెస్సులు, సర్‌ఛార్జీల ఆదాయాన్ని విభాజ్య నిధికి కలిపి ఉంటే రాష్ట్రాల వాటా అయిదు శాతం పెరిగి ఉండేది. సెస్సును ఏ లక్ష్యం కోసం సేకరిస్తే, అందుకోసమే ఖర్చుపెట్టాలి. కానీ, మాధ్యమిక, ఉన్నత విద్య సెస్సు కింద 2017 వరకు సేకరించిన రూ.94,000 కోట్లను ఇంతవరకు ఖర్చు చేయలేదని 2019 కాగ్‌ నివేదిక వెల్లడించింది. సర్‌ఛార్జీ వసూళ్లను మాత్రమే భారత సంఘటిత నిధిలో ఉంచి, మామూలు పన్ను ఆదాయంలాగే ఖర్చు చేయవచ్చు. సెస్సుల విషయంలో అలా కుదరదు. కానీ, భారత్‌ సెస్సు మొత్తాలను కూడా సంఘటిత నిధిలో ఉంచుతోంది. 2018-19 సెస్సు వసూళ్లలో 40 శాతాన్ని సంఘటిత నిధిలో ఉంచారు. సెస్సుల మీద రాష్ట్రాల అభ్యంతరాలు పెరుగుతున్న దృష్ట్యా, వాటిని అయిదేళ్లకు పరిమితం చేయాలి. ఎంతో అవసరమైతే తప్ప పొడిగించకూడదు. 1983లో సర్కారియా కమిషన్‌ కూడా సెస్సులను నిర్దిష్ట కాలానికే విధించాలని సూచించింది. రెండేళ్లకు మించి కొనసాగే సెస్సుల ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడానికి 271వ రాజ్యాంగ అధికరణను సవరించడం ఇంకా ఉత్తమ పద్ధతి.

- వరప్రసాద్‌
 

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం